శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By chj
Last Modified: గురువారం, 22 జూన్ 2017 (17:50 IST)

అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి... కామినేని

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సేవా స్పూర్తితో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు వివిధ వైద్య ఆరోగ్య పధకాలు ప్రవేశ పెట్టిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇప్పుడు అదే స్పూర్తితో ఎన్టీఆర్ కుమార

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సేవా స్పూర్తితో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు వివిధ వైద్య ఆరోగ్య పధకాలు ప్రవేశ పెట్టిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇప్పుడు అదే స్పూర్తితో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ అనేక మందికి కేన్సర్ బాధల నుంచి ఉపశమనం కలిగించి ఆధునిక వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న బయట రోగుల నమోదు 35 శాతం పెరిగిందని చెప్పారు. 
 
హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి 17వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొని మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు 12 శాతం పెరగడానికి ప్రధాన కారణం గతంలో కన్నా మెరుగైన వసతి సౌకర్యాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అని మంత్రి తెలిపారు. 
 
చనిపోయిన వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మానవీయకోణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఇంటికి ఉచితంగా ఏసీ వసతి ఉన్న ప్రత్యేక రవాణా వాహనంలో పంపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోను మహాప్రస్థానం పేరిట కార్యక్రమం ప్రారంభించామని మంత్రి చెప్పారు. ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ అత్యాధునిక ఆసుపత్రికి ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయిస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. 
 
ప్రభుత్వ పరంగా కర్నూలులో రాష్ట్ర కేన్సర్ ఆసుపత్రి, నెల్లూరులో కేన్సర్ ప్రాంతీయ విభాగం, విశాఖపట్నంలోని కేజీహెచ్లో క్యాన్సర్ బ్లాక్‌తోపాటు గుంటూరులో కేన్సర్ చికిత్స ఆధునిక కేంద్రం, ఎయిమ్స్‌లో ప్రత్యేక విభాగాలు రోగులకు సేవలను అందిస్తామని చెప్పారు. స్వాస్త్య విద్యావాహిని, మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ వంటి కార్యక్రమాలు అవగాహన పెంచి క్యాన్సర్‌ను నియంత్రిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌కు ఎదురొడ్డి విజేతలుగా నిలిచిన నటి గౌతమి, క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ ధైర్యస్థైర్యాలు అందరికి స్ఫూర్తి అని మంత్రి కామినేని గుర్తు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్ర, విద్యార్థులు, ప్రజల ఉమ్మడి సమస్యలు పరిష్కరించడాని అవసరమైన సందర్భాలలో తెలంగాణా వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కూర్చుని చర్చించి పరిష్కరిస్తున్నామని మంత్రి కామినేని తెలిపారు. 
 
ఇందుకు మంత్రి లక్ష్మారెడ్డి తగు విధంగా సహకరిస్తున్నట్లు సభాముఖంగా కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రి నిర్వాహకులు సభా వేదికపై కేక్ కట్ చేసినప్పుడు కేక్ ముక్కను తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ప్రేమపూర్వకంగా తినిపించారు. కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీ వివిఎస్ మూర్తి, నటి గౌతమి, పుల్లెల గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.