శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (12:45 IST)

చంద్రబాబు 15 సభలు పెట్టాడు.. నేను ఒక్క సభ పెట్టా : తెదేపాకు 1 - తెరాసకు 99 సీట్లు: కేసీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 15 సభలు పెడితే.. తాను కేవలం ఒక్కటంటే ఒకే సభ పెట్టానని దానికే ప్రజలు అనూహ్యంగా స్పందించి 99 సీట్లు ఇచ్చారని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీలో గెలుపొందిన తెరాస కార్పొరేటర్లంతా శనివారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. 
 
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు తమకు కట్టబెట్టిన విజయం ఆషామాషీ కాదన్నారు. ప్రజలు తమ బాధలు, కష్టాలు తొలగిపోతాయనే నమ్మకంతోనే గెలిపించారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు 15 సభలు పెడితే తాను ఒక్క సభే పెట్టానన్నారు. అయినా ప్రజలు తెదేపాకు ఒక్క సీటు ఇస్తే తమకు 99 సీట్లు ఇచ్చారన్నారు. 
 
ప్రజలు ఇచ్చిన ఈ గొప్ప విజయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటారన్నదే ముఖ్యమన్నారు. ప్రజల కష్టాలను తొలగించే బాధ్యత కార్పొరేటర్లపై ఉందన్నారు. ఖర్చు పెట్టే ప్రతిపైసా పేదల సంక్షేమానికే ఉపయోగించాలని సూచించారు. త్వరలోనే కార్పొరేటర్లకు రెండు రోజుల శిక్షణా శిబిరం ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ సమావేశం ఈ నెల 11న ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలి జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస 99 స్థానాల్లో గెలిచి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతితెలిసిందే. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను తెరాస కైవసం చేసుకోనుంది.