శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (17:57 IST)

సొంత డబ్బుతో భార్య మొక్కు తీర్చనున్న కేసీఆర్ .. కాళేశ్వర స్వామికి కిరీటం.. ఎప్పుడు?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దేవుళ్ల మొక్కుల పట్టింపులు ఎక్కువ. తెలంగాణ సీఎం అయ్యాక.. రాష్ట్రం కావాలన్న తన మొక్కులను సర్కారు సొమ్ముతో తీర్చుకోవడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే తన మొక్కులన్నీ తీర్చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు తన భార్య మొక్కులపై దృష్టి సారించారు. ఆయన తన సతీమణి శోభ మొక్కును త్వరలోనే తీరుస్తానని స్వయంగా తెలిపారు. అది కూడా ప్రభుత్వ ఖర్చుతో కాకుండా తన సొంత ఖర్చుతో తీరుస్తారని క్లారిటీ ఇచ్చారు. 
 
కేసీఆర్ భార్య శోభ కూడా భర్తలాగానే.. తన సొంతానికి మొక్కుకోలేదు. ఆమె కూడా తెలంగాణ రావాలన్న కోరిక కోసమే మొక్కారు. తెలంగాణ వస్తే కాళేశ్వర స్వామికి కిరీటం చేయిస్తానని శోభ మొక్కుకున్నానని చెప్పిందని... ఆ మొక్కు తీర్చుతానని కేసీఆర్ సిద్దిపేట పర్యటనలో చెప్పారు.

పనిలో పనిగా ఆయన సిద్ధిపేటకు పలు వరాలు ప్రకటించారు. త్వరలోనే సిద్ధిపేట జిల్లా అవుతుందని.. త్వరలోనే సిద్దిపేటకు రైలు వస్తుందని భరోసా ఇచ్చారు. మరి ఈ మొక్కుకైనా కేసీఆర్ సొంత డబ్బును ఖర్చు చేయడం స్వాగతించాల్సిందే. ఈ మొక్కును బోనాల సందర్భంగా కేసీఆర్ తీర్చుకుంటారని తెలుస్తోంది.