శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 21 ఫిబ్రవరి 2015 (09:58 IST)

తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు ఎందుకు?

తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సచివాలయంలో మీడియాపై ఆంక్షలు విధించలేదనీ, కానీ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు ఎందుకు విధించారో అర్థం కావడం లేదని విపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. 
 
నిజానికి తెలంగాణా ఉద్యమాలలో ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల సమయంలో మీడియాను విరివిగా ఉపయోగించుకొన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మీడియాతో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. మీడియా వాళ్ళెవరూ సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలులేదని తాజాగా ఆంక్షలు విధించారు. సచివాలయంలో మీడియా వ్యక్తులు తిరుగుతుండటం వలన అధికారుల పనికి ఆటంకం కలుగుతున్నందునే సాకుతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. 
 
అందుకు మీడియా ఆయనను చాలా తీవ్రంగా ఆక్షేపించింది. దానితో ఆయన కొంచెం వెనక్కి తగ్గి సచివాలయంలో మీడియా ప్రవేశాన్ని నిషేధించలేదని, కొంత నియంత్రణ అవసరమనే ఉద్దేశ్యంతో వారి రాకపోకలకు ఎటువంటి పద్ధతి ఏర్పాటు చేయాలనే అంశం గురించి చర్చించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మీడియా మిత్రులతో కూడా ఈ విషయం గురించి చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకొంటామని వివరణ ఇచ్చుకున్నారు. 
 
అలాగే మీడియా కూడా కొంత స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం కూడా. మంత్రులు అధికారుల నుండి సమాచార సేకరణ లేదా ఇంటర్వ్యూల కోసం యధేచ్చగా సచివాలయంలో తిరుగుతుంటే ఉద్యోగులు, అధికారుల పనికి ఆటంకం కలుగుతుంది. కనుక మీడియా కూడా ప్రభుత్వంతో సహకరించితే వారికీ గౌరవంగా ఉంటుందని తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు.