గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 18 జనవరి 2020 (18:02 IST)

కాలేజీకి వెళుతున్నాని వ్యవసాయ బావిలో శవమై తేలిన మెడికో

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామనికి చెందిన ఓ మెడికో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కనుపర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి వంశీ కాలేజీకి వెళుతున్నానంటూ శుక్రవారం బయటకు వెళ్లిన వ్యక్తి స్వంత వ్యవసాయ బావిలో శనివారం శవమై  కనిపించాడు. కాళ్ళూ చేతులు తాళ్లతో కట్టి వేసి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
 
వివరాలు చూస్తే... తుమ్మనపల్లి తిరుపతి - రమా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న కుమారుడైన వంశీ (22) ఖమ్మం జిల్లా మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన వంశీ శుక్రవారం సాయంత్రం ఖమ్మం బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. కానీ శనివారం గ్రామ శివారులోని వారి సొంత వ్యవసాయ భూమిలో శవమై తేలాడు. 
 
ఉదయం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులకు బావిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా బోరున విలపించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం గ్రామంలో ఉన్న సిసి ఫుటేజీలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పరకాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.