శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (11:17 IST)

ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై కాంగ్రెస్ ఆరేళ్ళ బహిష్కరణ వేటు!

పార్టీ విప్‌ను ధిక్కరించిన నవాబ్‌పేట జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు  తెలంగాణ పీసీసీ ప్రకటించింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో యాదవరెడ్డి చేతులు కలిపారు. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరిస్తున్న ఆయన శాసనమండలి ఛైర్మన్ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దతు పలికారు. కాంగ్రెస్ జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా రేసులో నిలిచిన యాదవరెడ్డి ఊహించనిరీతిలో గులాబీ గూటికి చేరారు. 
 
ఈ నేపథ్యంలోనే కౌన్సిల్ ఎన్నికలతో గులాబీ శిబిరానికి చేరువైన యాదవరెడ్డి.. జెడ్పీ ఎన్నికల్లోను ఆ పార్టీ అభ్యర్థికే ఓటేశారు. దీంతో పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని డీసీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై బదులివ్వాలని కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేంద్రమాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన యాదవరెడ్డి ఏఐసీసీ సభ్యుడు కూడా. ఈ క్రమంలోనే ఆయనపై బహిష్కరణాస్త్రం ప్రయోగించడం ఆలస్యమైందని పార్టీవర్గాలు స్పష్టం చేశాయి.