1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:47 IST)

హుజూర్ నగర్ లో మాదే విజయం..కేటీఆర్

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస జెండా ఎగురుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ కు లాభమని, తెరాస గెలిస్తే నియోజకవర్గానికి లాభమని, ఇదే తమ నినాదమని, దీన్నే ప్రచారం చేస్తామని కేటీఆర్ చెప్పారు.

తమకు ప్రతికూలతలు లేవని, అంటా సానుకూలంగానే ఉందని చెప్పారు. హుజూర్నగర్ ప్రజల్లో పూర్తి స్పష్టత ఉందని , నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజ్ఞులైన హుజూర్నగర్ ప్రజలు టీ ఆర్ ఎస్ ని గెలిపించుకొని అభివృద్ధిని సాధించుకుంటారని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికలకు ఉప ఎన్నికలకు తేడా ప్రజలకు తెలుసు… కాంగ్రెస్ కి ఓటు వేయడం వల్ల లాభం లేదని తెలుసు…అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉప ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ గెలిచిందని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు తరువాత జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని అన్నారు. హుజూర్నగర్ ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి వినమ్రంగా ఓట్లు అడుగుతామని చెప్పారు.

తాజాగా నిర్వహించిన సర్వేలో 55 శాతం టీఆర్ఎస్ పార్టీకి ,41 శాతం కాంగ్రెస్ కి ఉందన్నారు. పార్టీ నిర్ణయించిన 30మంది ఇన్చార్జిలు రేపట్నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సభ పైన ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.