శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (12:51 IST)

గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేసేందుకు పొన్నాల పాట్లు!

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దృష్టిసారించారు. ఇందులోభాగంగా గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆయన జీహెచ్ఎంసీ కాంగ్రెస్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమావేశాల్లో కీలక నేతల మధ్య ఉన్న అనైక్యత పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందని నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రధానంగా టీ-పీసీసీ చీఫ్ దృష్టి పెట్టారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ నేతలందరినీ ఓకే మార్గంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలను మొదలు పెట్టారు. 
 
కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న విషయాన్ని గ్రహించిన ఆయన పార్టీ కోసం పని చేసిన నేతలకు గ్రేటర్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మరి గ్రేటర్ ఎన్నికల్లో పొన్నాల అస్త్రాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.