శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (19:00 IST)

నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్‌కు లాగు తడుస్తోంది: రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి జైలు నుండి బయటికి రాగానే మీసం మెలేశారు. బెయిల్‌పై బయటికి వచ్చీ రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల బాణాలు సంధించారు. 'బిడ్డా, కేసీఆర్! వస్తున్నా...' అంటూ రేవంత్ రెడ్డి వేకప్ కాల్ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీని అంతం చేస్తానన్న వ్యక్తి పావురాల గుట్టలో కలిసిపోయాడని.. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదన్నారు.  
 
చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్‌కు లాగు తడుస్తోంది" అన్నారు."కేసీఆర్... నువు నిజంగా తెలంగాణ వాడివే అయితే, నీలో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారిని రాజీనామా చేయించు" అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కుట్రపూరితంగా తనను జైలుకు పంపాడన్నారు. 
 
పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే కేసీఆర్, ఏబీఎన్, టీవీ 9 గొంతు నొక్కిన సంగతి మర్చిపోయాడా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తన సొంత ఛానెల్ సాయంతో కేసీఆర్ అవాకులు, చెవాకులు పేల్చలేదా అంటూ ప్రశ్నించారు. మందులోకి సోడా పోసినోళ్లంతా మంత్రులయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. తాగుబోతును జాతిపిత అని సన్నాసులు అంటున్నారని, తాగుబోతు ఎక్కడైనా జాతిపిత అయితడా? అని రేవంత్ ప్రశ్నించారు.
 
ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడని అంటున్నారు. అంతేకాదు, తెలంగాణ జాతి పిత అని కూడా అంటున్నారు. ఈ సన్నాసి ఉద్యమం చేస్తే ఆ సన్నాసులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు" అని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అలా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఏమంటారని, వారి త్యాగాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి నిలదీశారు. అమర వీరుల వల్లే తెలంగాణ సాధ్యమైందని, రాష్ట్ర సాధన తమ వల్లే అయిందని ఎవరూ ఆపాదించుకోవద్దని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి హితవు పలికారు.