శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (11:44 IST)

స్కూలు బస్సును ఢీకొన్న నాందేడ్ ప్యాసింజర్ : విద్యార్థుల మృతి!

మెదక్ జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాపలాలేని రైల్వే గేటు వద్ద కాకతీయ విద్యా మందిర్‌కు చెందిన స్కూలు బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో స్కూలు బస్సు కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైంది. 
 
మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 26 మంది విద్యార్థులు మృతి చెందారు. రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును ఓ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
 
 కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.