శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (13:01 IST)

నేతల తీరు మారలేదు.. శిక్ష తప్పదు : నా కాసులు ఎక్కడంటూ ఉజ్జయినీ మహంకాళి ప్రశ్న

కొత్త రాష్ట్రం వచ్చినా కొంతమంది నేతల తీరు మారడం లేదనీ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారు స్వర్ణలత రూపంలో చెప్పింది. ఈ ఆలయ వేడుకల్లో భాగంగా రంగం కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందులో పచ్చికుండపై మహంకాళి పూనిన స్వర్ణలత నిలబడి భవిష్యవాణిని వినిపించింది.
 
తప్పులు చేసిన అందరికీ తప్పకుండా శిక్ష పడుతుందని రంగంలో అమ్మవారు హెచ్చరించింది. రాష్ట్రం వచ్చినా నా గురించి ఆలోచించరేమని రంగంలో అమ్మవారు ప్రశ్నించింది. కొత్త రాష్ట్రం వచ్చినా కొందరు నేతలు ప్రవర్తన మార్చుకోలేదని చెప్పింది. ఎన్ని కష్టాలు వచ్చినా భక్తులు నాకు పూజలు చేస్తున్నారని, అలాగే ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరింది. 
 
అంతేకాకుండా, ఆలయ అభివృద్ధి జరగడం లేదని, కాసులు ఎంతమాత్రమూ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "నా కాసులెక్కడరా?" అని ప్రశ్నించింది. తాను కళ్లు మూసుకుని చూసీ చూడనట్టు జీవిస్తున్నానని గతంలో పావలా, అర్థరూపాయి కానుకలు వచ్చినా, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాబడి పెరుగుతూ ఉంటే, ఎవరికి వారు దోచుకుందామని చూస్తున్నారని అన్నారు. తన కాసులను కాజేయాలని చూస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.