మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:34 IST)

రేవంత్ రెడ్డి రాజీనామాతో నల్గొండ టీడీపీ ఖాళీ...

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రెడ్డి వర్గం నేతలు అత్యధికంగా ఉన్న పూర్వపు నల

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రెడ్డి వర్గం నేతలు అత్యధికంగా ఉన్న పూర్వపు నల్గొండ జిల్లాలోని పలువురు నేతలు ఇప్పుడు రేవంత్ వెంట నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఫలితంగా నల్గొండ జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది.
 
ముఖ్యంగా అధికారికంగా ఎవరి పేర్లూ బయటకు రాకపోయినా, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చెందిన ప్రధాన నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు మినహా మిగతా వారంతా రేవంత్ వెంట వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సుమారు 25 మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
ఈ జిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న వారిలో దివంగత హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యక్తులు. నర్సింహులు మినహా మిగతావారు రేవంత్‌ వెంట వెళితే, పార్టీకి పెను నష్టమే జరుగుతుంది. కంచర్ల భూపాల్‌ రెడ్డి, పటేల్‌ రమేష్‌ రెడ్డిలు టీడీపీని వీడనున్నారు. 
 
ఇదిలావుండగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎందుకు మాట్లాడారో తెలియజేయాలని కోరుతూ నల్గొండ టీడీపీ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు అందాయి. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ నోటీసులను పంపుతూ, వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినందున క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని కోరారు.