ఓటుకు నోటు కేసు : టీడీపీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం!
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసులో టీడీపీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం కోసం ఏసీబీ కొంతకాలంగా ఆరాతీస్తున్న విషయం తెలిసిందే.
ఏసీబీ దర్యాప్తులో గోపీనాథ్ నుంచే ఆ నగదు తీసుకుని స్టీఫెన్సన్ వద్దకు రేవంత్రెడ్డి వెళ్లారని తాజాగా వెల్లడైంది. ఈ ఆధారాలతో గోపీనాథ్కు నేడో రేపో వారంటు జారీ చేసి, అరెస్టు చేయాలని ఏసీబీ పోలీసులు భావిస్తున్నట్టు ఆ వర్గాల కథనం. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆయన షరతులతో కూడిన బెయిలుపై బయటికి రావడం తెలిసిందే. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డికి గోపీనాథ్ రెడ్డి నగదు సమకూర్చినట్టు ఏసీబీ భావిస్తోంది. అందుకే ఆయనను అరెస్టుచేసి విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని బలంగా నమ్ముతోంది.