శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2015 (21:47 IST)

కేసీఆర్ ''పెద్దలు జానా...'' సభలో నవ్వులు... లేచెళ్లిపోయిన ఉత్తమ్, భట్టి

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అని చెప్పుకునే జానారెడ్డి తీరు టి.కాంగ్రెస్ కు మింగుడుపడటం లేదట. రైతుల ఆత్మహత్యలపై విపక్షాలన్నీ కలిసి అధికార పక్షంపై దాడి చేస్తుంటే జానారెడ్డి మాత్రం మెత్తగా మాట్లాడుతున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడుతూ... పెద్దలు జానారెడ్డి అని అనగానే అప్పటివరకూ ప్రభుత్వ వైఖరిని నిగ్గు తేల్చాలని కంకణం కట్టుకున్నట్లుండే జానా... ఆ మాటకే ఐస్ అయిపోతున్నారట. 
 
ఏమీ మాట్లాడుకుండా సుతిమెత్తగా మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మైలేజీ రోజురోజుకీ పడిపోతోందట. దీనిపై ఆ పార్టీకి చెందిన నేతలే తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని సమాచారం. మొన్న సభలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో నిరసన చేపట్టాలని అందరూ నిర్ణయానికి వస్తే.. జానా మాత్రం అందుకు ససేమిరా అన్నారట. చివరికి ఒత్తిడి తెచ్చేసరికి సరేనని ఒప్పుకున్నారట. 
 
తాజాగా మళ్లీ సభలో సీఎం కేసీఆర్ పెద్దలు జానారెడ్డి అని జానారెడ్డిని ఉద్దేశించి సంబోధించడంతో సభలో నవ్వులు రాలాయి. మళ్లీ యధాప్రకారం జానా మెత్తగా మాట్లాడటం మొదలెట్టారట. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ తీవ్ర అసహనానికి లోనై సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారట. మరి జానా తీరు మారుతుందో లేదో...?!!