శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2018 (09:21 IST)

ఆ ముం.... కొడుకులే ఇపుడు మంత్రివర్గంలో ఉన్నారు : మంత్రి నాయిని బూతుపురాణం

తెలంగాణ ఉద్యమం సమయంలో తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావును పరుష పదజాలంతో తిట్టిన నేతలే ఇపుడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ మంత్రివర్గంలో కీలకశాఖల్లో ఉన్నారంటూ ఆ రాష్ట్ర హో మంత్రి నాయిని నర్సింహా రెడ్డి

తెలంగాణ ఉద్యమం సమయంలో తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావును పరుష పదజాలంతో తిట్టిన నేతలే ఇపుడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ మంత్రివర్గంలో కీలకశాఖల్లో ఉన్నారంటూ ఆ రాష్ట్ర హో మంత్రి నాయిని నర్సింహా రెడ్డి రాయలేని భాషలో బూతులు తిట్టారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ముద్రించిన 2018 క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారంటూ బూతు పురాణం చదివారు. రాయడానికి వీల్లేని భాషలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తిట్టినోళ్లు నేడు ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకళించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు. 
 
అదేసమయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. మర్రి చెన్నారెడ్డి ఓ మగాడు అంటూ కితాబిచ్చారు. ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చలేదన్నారు. 1969 ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, ఎన్నో శక్తులు అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామన్నారు. ఇక, రైతులకు 24 గంటల కరెంటు అందజేస్తూ సీఎం కేసీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు.