శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (10:26 IST)

సర్వేకు రూ.20 కోట్లు ఖర్చు.. కవిత స్థానికం కాదు.. అయినా...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కోసం అక్షరాలా 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ సర్వేలో అనేక ప్రముఖులు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కె కవిత మాత్రం స్థానికం కాకపోయినప్పటికీ తన వివరాలను నమోదు చేసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
మంగళవారం చేపట్టిన ఈ సమగ్ర సర్వే గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెల్సిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించారని తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఒక్క రోజు సర్వేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను తన ఖజానా నుంచి విడుదల చేసింది.
 
మరోవైపు.. సమగ్ర సర్వేలో కొన్ని అంశాలు చర్చనీయాంశం కూడా అయ్యాయి. అలాంటి వాటిలో కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత వివరాల నమోదు కూడా ఒకటి. కవిత అత్తగారి ఊరు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్. ఈ ఊరిలో కవిత నివాసం ఉండటం లేదు. అయినప్పటికీ, కవిత వివరాలను ఆమె అత్తమామలు నమోదు చేయించారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్, విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.