శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Modified: బుధవారం, 4 మార్చి 2015 (05:14 IST)

కోర్టు విభజనపై తేల్చండి... జాప్యమెందుకు?

రాష్ట్రం విడిపోయింది.. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు... ఇంకా కోర్టును విభజించడానికి వచ్చిన అభ్యంతరం ఏమిటి? వెంటనే ఆ సమస్యను తేల్చితే మరింత ప్రశాంతంగా రెండు రాష్ట్రాలు ఉండిపోతాయి కదా... అంటూ టీఆర్ ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి మంగళవారం పార్లమెంటులో తన వాదన వినిపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తిన దీనిపై చర్చకు అనుమతించాలని వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు. 
 
 ఏపీ విభజన చట్టం లో ఉమ్మడి హైకోర్టును విభజించాలని స్పష్టంగా ఉందనీ,ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తమ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రిని, సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లను కూడా కలిశారని అన్నారు. హైకోర్టు విభజన పూర్తయ్యాకే జూనియర్ జడ్జీల నియామకాలను చేపట్టాలని కోరినా.. న్యాయస్థానాలు అంగీకరించలేదని పేర్కొన్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ఈ విషయాన్ని న్యాయమంత్రి పరిశీలిస్తున్నారని చెప్పారు. మరో ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ హైకోర్టు విభజనపై మంత్రి సదానందగౌడ నాకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం నుంచిగానీ, ఉమ్మడి హైకోర్టు నుంచిగానీ ప్రతిపాదనకు జవాబు రాలేదని పేర్కొన్నారని చెప్పారు. వారి నుంచి సమాధానం వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.