శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 30 మార్చి 2017 (04:53 IST)

ఆమె చావుకు నువ్వే కారణమన్నారు.. విదేశంలో ఉరేసుకున్నాడు..

సోషల్ మీడియా తంపులకూ కార్పణ్యాలకూ ప్రధాన కారకురాలిగా మారుతుందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఒక సంచలన వ్యాఖ్యతో, వక్రీకరణతో దేశాన్ని మండించేటంత పవర్ మీడియాగా మారాక, వ్యక్తుల భావోద్వేగాలు మామూలు జీవితంలో ఊహించలేనంత పరాకాష్టకు చేరుకుంటున్నాయి.

సోషల్ మీడియా తంపులకూ కార్పణ్యాలకూ ప్రధాన కారకురాలిగా మారుతుందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఒక సంచలన వ్యాఖ్యతో, వక్రీకరణతో దేశాన్ని మండించేటంత పవర్ మీడియాగా మారాక, వ్యక్తుల భావోద్వేగాలు మామూలు జీవితంలో ఊహించలేనంత పరాకాష్టకు చేరుకుంటున్నాయి. దేశదేశాల ప్రజలను, అపరిచితులను పరిచితులుగా మార్చివేస్తున్న ఈ అద్బుతమైన ప్రజా మీడియా ఉట్టిపుణ్యానికే మనుషుల ప్రాణాలనూ తీసేస్తోంది.
 
జగిత్యాల జిల్లానుంచి బతుకుదెరువు కోసం సౌదీ పయనమైన ఒక యువకుడు ఒక అమ్మాయి ఆత్మహత్యకు నువ్వే కారణమంటూ సోషల్ మీడియాలో తనగురించి వచ్చిన పోస్టింగులు చూసి గుండె పగిలి సౌదీ అరేబియాలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరునెలల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లిన కుంట రాజశేఖర్ అనే యువకుడు విదేశానికి వెళ్లడానికి ముందు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటకు చెందిన అమ్మాయిని ప్రేమించినట్లు సమాచారం. కానీ ఆమె ఈ నెల 25న ఏ కారణంతోనో ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీంతో ఆ ఆమ్మాయి చావుకు అతడే కారణమంటూ కొందరు వ్యక్తులు  ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కొందరు పోస్టింగ్‌లు చేసినట్లు వార్త. మీడియాలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలియగానే  రాజశేఖర్ మంగళవారం సౌదీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అమ్మాయి చావుకు కారకులెవరో కానీ తమ కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజశేఖర్ తల్లిదండ్లులు కోరడం కొసమెరుపు.
 
ఇలాంటి ఘటనలు చూస్తే, చదివితే సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదంటున్న వారి అభిప్రాయాలు కూడా ఒక కోణంలో సమంజసమే అనిపించక మానదు కదా.