1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Sandeep
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (20:00 IST)

పవన్ కల్యాణ్ మామూలు మనిషి కాదు... విజయశాంతి

సినీ రంగంలో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి హీరోయిన్‍గా కొనసాగుతున్న కాలంలోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు.

సినీ రంగంలో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి హీరోయిన్‍గా కొనసాగుతున్న కాలంలోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత సినిమాలకూ, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత సినీ, రాజకీయ పరిస్థితుల గురించి స్పందించారు. ఆమె మనోభావాలను వ్యక్తపరిచారు.
 
సినిమా రంగంలో తను డబ్బు, హోదా అన్నీ చూశానని, పేరు ప్రఖ్యాతుల కోసం లేదా ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టానని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఒక మేజర్ సర్జరీ కూడా జరిగిందని దాని కారణంగానే సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని విజయశాంతి పేర్కొన్నారు.
 
ప్రజా సేవకు అంకితం కావాలన్న ఉద్దేశంతో పిల్లల్ని కనకూడదనుకున్నానని, సంతానం ఉంటే ఆశ, స్వార్థం పెరిగిపోతాయని భావించి తను, తన భర్త కలిసి ఆ నిర్ణయానికి వచ్చామని, ప్రజల్నే పిల్లలుగా భావిస్తున్నానని చెప్పారు. తనకు విలాసవంతమైన జీవితంపై ఆసక్తి లేదనీ, తన మరణానంతరం ఆస్తి మొత్తం ప్రజలకు చెందేలా చర్యలు తీసుకుంటాననీ, తన తల్లి పేరున, తన పేరున ఫౌండేషన్‌ని ఏర్పాటు చేస్తాననీ, విద్య, వైద్యం కోసం తన ఆస్తిని కేటాయిస్తానని మెదక్‌లో ఇదివరకే చెప్పాను. ఒక దశలో తన నగలన్నీ తీసుకువెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో కూడా వేశానని వెల్లడించారు.
 
రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు అధికంగా ఉంటాయని, సినీ నటులు చాలా సెన్సిటివ్, వాటిని తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పారు. ఆ కారణంగానే వారు స్వచ్ఛంద సేవ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ మంచి దూకుడు ప్రదర్శిస్తున్నారనీ, ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పవన్ వ్యక్తిత్వం డిఫరెంట్ అనీ, ఆయన మామూలు మనిషి కాదనీ, ఆంధ్రా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని వెల్లడించారు.
 
రాజకీయాల్లోని ఒడిదుడుకులను ఎదుర్కొని చివరి వరకూ పవన్ ఎలా నిలబడతారో వేచి చూడాలని చెప్పారు. చిరంజీవి గారు, తను ఒకే పార్టీలో ఉన్నా ఎలాంటి సమస్యలూ రావన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం చేయవచ్చనీ, హీరోగా, నాయకుడిగా ప్రజాదరణ పొందిన వ్యక్తి చిరంజీవిగారనీ, ఆయన తెలంగాణలో ప్రచారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయనతో కలిసి తను కూడా ప్రచారం చేస్తానని విజయశాంతి చెప్పారు.