శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (12:13 IST)

ప్రచారం మొదలుపెట్టిన హైపర్ ఆది, గబ్బర్ సింగ్ గ్యాంగ్

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఆది సమకాలీన అంశాల గురించి తన స్కిట్‌లలో పంచ్‌లు వేస్తుంటారు. ముందు నుండి పవన్ కళ్యాణ్‌పై అభిమానం చూపే ఆది ఎన్నికల ప్రచారం కోసం రంగంలో దిగారు. జనసేన పార్టీ తరఫున తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్‌కు మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ గాజు గ్లాసుకు ఓటు వేయాలని, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలని ప్రచారం జోరుగా సాగిస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరే పార్టీలవారు డబ్బులిస్తేనో లేదా బిర్యానీ ఇస్తేనో జనాలు వస్తారు. కానీ జనసేన అంటే చాలు జనాలు వారంతట వారే వచ్చి మద్దతు ఇస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించబోతోందని, దేశంలోనే మొదటిసారిగా రైతులకు పింఛను ప్రకటించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.

ఇక ఎవరి నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా టిక్కెట్ ఇచ్చిన పవన్ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారని, అటువంటి వ్యక్తి సీఎం అయితేనే తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీ తరఫున విజయం సాధించే మొదటి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కావాలని కోరుకుంటూ ఆయన కోసం తెనాలి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నట్లు ఆది తెలిపారు.

మరోవైపు గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశంలో గుర్తింపు తెచ్చుకున్న రౌడీల గ్యాంగ్ మంగళగిరి జనసేన పార్టీ కార్టాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి పూలమాల వేసారు. తాము కూడా జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.