శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 16 మార్చి 2018 (17:30 IST)

కలెక్టర్‌ మధువర్షిణి (నయనతార) 'కర్తవ్యం' కళ్ల నీళ్లు తెప్పిస్తుంది... రివ్యూ రిపోర్ట్

నయనతార ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం 'ఆరమ్‌'. ఆ చిత్రాన్ని తెలుగులో శరత్‌ మరార్‌ 'కర్తవ్యం'గా ఈ శుక్రవారమే విడుదల చేశారు. దీనికి సినిమాటోగ్రఫర్‌: ఓం ప్రకాష్‌, ఎడిటర్‌: రూబెన్‌, సంగీతం: జిబ్రన్‌, నిర్మాత: శరత్‌ మరార్‌, రవీంద్రన్‌, స్క్రీన్‌ ప్లే:

నయనతార ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం 'ఆరమ్‌'. ఆ చిత్రాన్ని తెలుగులో శరత్‌ మరార్‌ 'కర్తవ్యం'గా ఈ శుక్రవారమే విడుదల చేశారు. దీనికి సినిమాటోగ్రఫర్‌: ఓం ప్రకాష్‌, ఎడిటర్‌: రూబెన్‌, సంగీతం: జిబ్రన్‌, నిర్మాత: శరత్‌ మరార్‌, రవీంద్రన్‌, స్క్రీన్‌ ప్లే: గోపి నైనర్‌, దర్శకత్వం: గోపి నైనర్‌.
 
కథ :
కలెక్టర్‌ మధువర్షిణి (నయనతార) తన అధికారంతో ప్రజలకు సేవ చేయాలనే తత్త్వం వున్న మనిషి. మంచినీటి కోసం అల్లాడుతున్న గ్రామానికి తన అధికారంతో నీళ్ళు రప్పించేలా చేస్తుంది. అలాంటి గ్రామంలో కూలీ చేసుకునే సుమతి కుమార్తె ధన్సిక ఆడుకుంటూ ఓ బోరుబావిలో పడిపోతుంది. ఇది తెలిసిన వెంటనే తన అధికారంతో మిగిలిన యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తుంది. అయితే ఆ బోర్‌బావి స్థలం స్థానిక సర్పంచ్‌ది. ఎన్నిసార్లు విన్నవించినా దాన్ని మూయకుండా వుండటంతో ప్రజలంతా ఆయన్ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తారు. అందుకు సిద్ధమైన ఆమెకు మంత్రి, ఎం.ఎల్‌.ఎ. నుంచి బెదిరింపులు వస్తాయి. అయినా అధికారిగా తన పనులు తాను చేసి పాపను కాపాడుతుంది. అది ఏరకంగా అనేది చిత్రంలో చూడాల్సిందే.
 
విశ్లేషణ :
సమాజంలో జరిగిన ఓ సంఘటనపై పలు డాక్యుమెంటరీలు వస్తుంటాయి. కానీ దేశంలో వున్న బోర్‌బావి వంటి సమస్యను వెండితెరపై ఆవిష్కరించేట్లుగా చేయాలనే ఆలోచన కల్గిన దర్శకుడు గోపి నైనర్‌ను అభినందించాలి. మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజల వెతలు, వారిపై ప్రభుత్వం చూపే నిర్లక్ష్య ధోరణి ఎలా వుంటుందనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఐఎఎస్‌, ఎపిఎస్‌లు ఎవరైనా శిక్షణ కాలంలో ప్రజలకు సేవ చేయాలనేది వారి అభిమతం. అలాంటి వారిని సరైనవిధంగా సేవ చేయకుండా అడ్డుకోవడమనేది మన వ్యవస్థలో వేళ్లూనుకుపోయింది. నిజాయితీగా పనిచేస్తే విచారణ పేరుతో శిక్షించడం కూడా ఎలా వుంటుందో ఇందులో చూపించాడు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం, అధికారులు, ప్రజలు వంటి అంశాలపై లోతుగా చర్చించడం బాగుంది. ఇందుకు టీవీ ఛానల్‌లో ఇద్దరు ప్రముఖులతో చర్చ పెట్టడం సరైందే అయినా నిడివి తగ్గిస్తే బాగుండేది.
 
దేశం రోజురోజుకూ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఆకాశంలోకి రాకెట్లను పంపించి ఏదో సాధించామని ప్రకటించుకునే ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి మీనమేషాలు లెక్కిస్తూ ఏవో సాకులు చెప్పడం వంటివి కళ్ళకు కట్టినట్లు చూపించాడు. రాకెట్‌తో సాంకేతికత పెరిగినా, బోరుబావిలో పడిన పిల్లను తీయడానికి బూజుపట్టిన పద్ధతుల్నే ఉపయోగిస్తూ అందుకు ప్రభుత్వం కూడా సమర్థించుకోవడం వర్తమాన చరిత్రకు అద్దం పడుతుంది. మరోవైపు నిజాయితీగా కర్తవ్యాన్ని నిర్వర్తించే అధికారులకు లోకల్‌ రాజకీయాలు ఎలా అడ్డు తగులుతున్నాయి అనే అంశాలను స్పష్టంగా చూపించారు. సినిమాలోని అంశం చిన్నదైనా.. బావిలో పడివున్న చిన్నారిని కాపాడే ప్రయత్నాలను వాస్తవికంగా చూపించి కొన్ని సన్నివేశాల్లో కళ్ళలో నీళ్లు తిరిగే భావోద్వేగాన్ని, ఊపిరి బిగబట్టే ఉత్కంఠతను కలిగించారు. సినిమాటోగ్రఫర్‌ ఓం ప్రకాష్‌ కూడ దర్శకుడి విజన్‌‌కు తగ్గట్టు విజువల్స్‌‌ను హృదయాన్ని తాకేలా కెమెరాలో బంధించారు.
 
సామాజిక అంశాలను, సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాన్ని, అధికారుల్లోని అలసత్వాన్ని, నిజాయితీతో పనిచేసే అధికారులపై రాజకీయ ఒత్తిళ్లను, గ్రామీణ, పట్టణ జీవితాల్లోని వ్యత్యాసాన్ని కళ్ళకుకట్టినట్టు చూపిందీ చిత్రం. అయితే, ఇలాంటి వాస్తవికత కథల్లో వినోదం ఆశించడం కష్టమే అయినా.. అంతే వాస్తవంగా సర్పంచ్‌కు తగిన విధంగా బుద్ధిచెప్పే క్రమంలో కథను మరింత ఆసక్తికరంగా చూపించి వుంటే బాగుండేది.
 
ఇటీవలే ఓ నాయకుడు అన్నట్లు... ఐఎఎస్‌, ఐపీఎస్ చదవాలంటే కష్టంతో కూడిన పనే. అది అందరికీ సాధ్యపడదు. కానీ వారందరినీ శాసించాలంటే ఒక్క రాజకీయమే సరైన మార్గం. అందుకే ఈ సినిమాలో ప్రజలకు సేవ చేయాలంటే కలెక్టర్‌ కావాల్సిన అవసరం లేదంటూ.. తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేసే వైపుగా వెళ్ళేట్లుగా నయనతార కదలికతో ముగింపు ఇవ్వడం విశేషం.