శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (15:47 IST)

నోరు జారిన అమిత్ షా... యడ్యూరప్ప అవినీతిపరుడంటూ...

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోరుజారారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అవినీతిపరుడంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోరుజారారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అవినీతిపరుడంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. మే 12వ తేదీన పోలింగ్ నిర్వహించి, 15వ తేదీన ఫలితాలను వెల్లడిచంనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓ ప్రకాష్ రావత్ వెల్లడించారు. 
 
ఈ షెడ్యూల్ విడుదలైన తర్వాత అమిత్ షా మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు.
 
ఈ మధ్యే సుప్రీంకోర్టుకు చెందిన ఓ రిటైర్డు జడ్జి దేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి మాట్లాడుతూ, ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం యెడ్యూరప్పదే అని చెప్పారని షా తెలిపారు. 
 
అదేసమయంలో అమిత్ షా పక్కనే యెడ్యూరప్ప కూడా కూర్చున్నారు. షా మాటలతో యెడ్డీ ఖంగుతిన్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో నేత షా చెవిలో ఏదో చెప్పారు. దీంతో, చేసిన పొరపాటును గ్రహించిన అమిత్ షా... యెడ్యూరప్ప కాదు, సిద్ధరామయ్య అని సవరించుకున్నారు.
 
కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. షా మాటలను కాంగ్రెస్ ఆయుధంగా మలుచుకుంది. అమిత్ షా మాటలను క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు... 'ఎట్టకేలకు చివరకు షా నిజాలు మాట్లాడారు' అంటూ సందేశాన్ని కూడా జత చేశారు. 
 
మొత్తంమీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు కాంగ్రెస్‌కు తిరుగులేని ఆయుధంగా మారింది. అమిత్ షా చేసిన పొరపాటు ఇప్పుడు బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసింది.