గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (12:29 IST)

మా అక్క అఖిలను టచ్ చేయాలంటే.. భూమా ఫ్యామిలీని దాటి వెళ్లాలి... నాగ మౌనిక

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ రాజకీయాలు రంజుగా మారాయి. భూమా నాగిరెడ్డి కుమార్తె, రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి ప్రత్యర్థి అయిన ఏవీ సుబ్బారెడ్డి తన ఆధిపత్యం కోసం నిర్వహించిన ర్యాలీతో ఆళ్ళగడ్డ రాజకీయ

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ రాజకీయాలు రంజుగా మారాయి. భూమా నాగిరెడ్డి కుమార్తె, రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి ప్రత్యర్థి అయిన ఏవీ సుబ్బారెడ్డి తన ఆధిపత్యం కోసం నిర్వహించిన ర్యాలీతో ఆళ్ళగడ్డ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. దీంతో ఆళ్ళగడ్డ పంచాయతీ కాస్త అమరావతికి చేరింది. భూమా అఖిల ప్రియా రెడ్డితో పాటు ఏవీ సుబ్బారెడ్డిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కబురు పెట్టి.. తన వద్దకు రావాల్సిందిగా ఆదేశించారు.
 
ఈనేపథ్యంలో, భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె నాగ మౌనిక మండిపడ్డారు. ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఆమె మాటల్లోనే... 'నాన్న చనిపోయాక చిన్న పిల్లలమైన మేము ఎంతో సహనంతో ఉన్నాం. ఏవీ సుబ్బారెడ్డి చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన పిల్లలు, మేము కలిసే పెరిగాం. నాన్న చనిపోయాక ఏవీ సుబ్బారెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నాడు. అఖిలప్రియ అంటే భూమా అఖిలప్రియ అని ఏవీ మరిచిపోతున్నాడు. ఏవీ సుబ్బారెడ్డి రాజకీయంగా ఎదగాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భూమా అఖిలప్రియ, భూమా కుటుంబంపై వేలెత్తి చూపితే సహించేది లేదు' అంటూ హెచ్చరించింది. 
 
అంతేనా, 'నాన్న చనిపోయాక భూమా కుటుంబానికి అండగా ఉంటానని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. సీఎంపై మాకు నమ్మకం ఉంది. మా అక్కపైన, మా కుటుంబంపైన వేలెత్తి చూపితే రియాక్టు కాక తప్పదు. ప్రస్తుతం నేను ఏడు నెలల గర్బిణిని. మా కుటుంబాన్ని మీడియా, ప్రజల్లో చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక బయటికొచ్చి మాట్లాడుతున్నా. ఆళ్లగడ్డ, నంద్యాల కార్యకర్తలే మా కుటుంబం. నేను స్కెచ్‌ (ప్రణాళిక) వేస్తే భూమా ముందుకు వెళ్లేవాడని ఏవీ పదే పదే అంటున్నాడు. అలా అయితే ఆయన నంద్యాలలో ఎందుకు ఓడిపోయాడు..?. 
 
మా అక్క భూమా అఖిలప్రియ భూమా నాగిరెడ్డి కూతురు, ఎస్వీ సుబ్బారెడ్డి మనవరాలు, ఎస్వీ మోహన్‌రెడ్డి మేనకోడలు. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చెల్లెలు.. అనే విషయాన్ని మరిచిపోకూడదు. అఖిలను టచ్‌ చేయాలంటే ముందుగా భూమా కుటుంబాన్ని టచ్‌ చేయాల్సి ఉంటుంది' అంటూ హెచ్చరించారు. ఓ వైపు ముఖ్యమంత్రితో సమావేశం ఉండగా, ఏవీ సుబ్బారెడ్డిని హెచ్చరిస్తూ నాగమౌనిక చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి.