శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (14:51 IST)

కన్నాకు పదవి... 'కమలం'లో కుమ్ములాటలు... అజ్ఞాతంలోకి సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ నియమితులయ్యారు. ఇది కమలం పార్టీలో కుమ్ములాటలకు దారితీసింది. అధ్యక్ష పదవిపై గంపెడాశలు పెట్టుకున్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ నియమితులయ్యారు. ఇది కమలం పార్టీలో కుమ్ములాటలకు దారితీసింది. అధ్యక్ష పదవిపై గంపెడాశలు పెట్టుకున్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు.
 
పార్టీ జాతీయ నాయకత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని గుంటూరుకు చెందిన కన్నా లక్ష్మీనారాయణకు కట్టబెట్టింది. దీంతో సోము వీర్రాజు తీవ్ర నిరాశకు గురై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేరు.
 
నిజానికి బీజేపీలో సీనియర్‌ నాయకుడైన సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవిని చాలాకాలం నుంచి ఆశిస్తున్నారు. గతంలో ఒక్కసారి వచ్చినట్లే వచ్చి దక్కకుండా పోయింది. కంభంపాటి హరిబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కొద్దిరోజుల క్రితం రాజీనామా చేయడంతో పార్టీ జాతీయ అధిష్టానం పలు పేర్లను పరిశీలించింది. 
 
అందులో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణపేర్లు ఉన్నాయి. కాని ఈ పదవి సోము వీర్రాజుకు ఖరారైందనే ప్రచారం జరగడంతో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. తర్వాత ఆయనకు అనారోగ్యం రావడంతోపాటు బీజేపీ అధిష్టానం నుంచి హామీ రావడంతో వైసీపీలో చేరడం విరమించుకున్నారు. 
 
ఇపుడు కన్నాను ఏకంగా అధ్యక్షుడిగా నియమించడంతో సోము వీర్రాజుతో పాటు.. ఆయన వర్గం నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో తమ నేతను పదవి ఇవ్వనందుకు నిరసనగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు తమ పదవులకు రాజీనామా చేశారు. 
 
అలాగే, తమతో పాటు తమ కార్యవర్గం అంతా రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు, ప్రధాన కార్యదర్శి రామ్‌మాదవ్‌కు ఫ్యాక్స్‌ చేసినట్లు వారు ప్రకటించారు. దీంతో కమలం పార్టీలో కూడా వర్గ పోరు బయటపడినట్టయింది.