గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (16:44 IST)

మోడీ ఏం ఇచ్చారు.. ముంత మట్టి.. చెంబుడు నీళ్లు మినహా : చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రధాని మోడీ ఏం ఇచ్చారంటూ ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రధాని మోడీ ఏం ఇచ్చారంటూ ప్రశ్నించారు. అమరావతి రాజధాని శంకుస్థాపన రోజున తెచ్చి ముంత మట్టి, చెంబుడు నీళ్ళు మినహా ఏం ఇచ్చారంటూ ఆయన నిలదీశారు.
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు ప్రసంగిస్తూ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని నేరుగా ప్రధాని మోడీకి ఫోన్ చేసి చెప్పానని... అయినా ఫలితం లేకపోయిందన్నారు. 
 
ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధులను ఇచ్చేశామని చెప్పారని... గట్టిగా అడిగితే లెక్కలు ఇవ్వలేదని బుకాయిస్తున్నారని విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం లోటును భర్తీ చేయాలని మళ్లీ కోరుతున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.13000 కోట్లు ఖర్చయితే... కేంద్రం నుంచి ఇప్పటివరకు కేవలం రూ.5,349 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉందని చెప్పారు.
 
యూసీలు ఇవ్వడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదు అని చెప్పడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లో విశాఖ రైల్వే జోన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని... ఎన్నో కమిటీలు వేశారని... కానీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రైల్వే జోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని పెండింగ్‌లో పెట్టారని అన్నారు. 
 
కేంద్ర సంస్థలకు రూ.11,300 కోట్లు అవసరమని... అయితే రూ.421 కోట్లే ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. తిరుపతి ఐఐటీకి రూ.3300 కోట్లు అవసరం కాగా, రూ.100 కోట్లే ఇచ్చారన్నారు. తాడేపల్లి ఎన్‌ఐటీకి రూ.60 కోట్లు ఇచ్చారని, నిధులు ఇవ్వకపోతే విద్యాసంస్థలు ఎప్పటికి నిలదొక్కుకుంటాయని సీఎం ప్రశ్నించారు. నిర్ణీత గడువులోగా విద్యాసంస్థలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీ సీట్లను పెంచలేదని విభజన చట్టంలో ఉన్నా కేంద్రం పెంచలేదని, ఈ విషయాన్ని తాను అడగదల్చుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
ఏపీకి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో చెబుతుండగా... దానికి అడ్డుపడిన వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు, 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పుడు రాజ్యసభలో జరిగిన చర్చను సీఎం చంద్రబాబు బుధవారం అసెంబ్లీలో గుర్తుచేశారు. విభజన సమయంలో బీజేపీ డిమాండ్‌ చేయడంతో, ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో నాటి ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ న్యాయం చేస్తుందనే పొత్తుపెట్టుకున్నామని, విభజన సమస్యలు చాలా వరకు పరిష్కారం కాలేదని ఆరోపించారు.