మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (14:14 IST)

రేప్ చేస్తే కొట్టి చంపేసినా కేసులు పెట్టకూడదు : పవన్ కళ్యాణ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా మానభంగం చేశారు. ఈ బాలికను కిడ్నాప్ చేసి ఓ ఆలయంలో వారం రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై కొందరు కామాంధులు అత్యంత పాశవికంగా మానభంగం చేశారు. ఈ బాలికను కిడ్నాప్ చేసి ఓ ఆలయంలో వారం రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో పలు రాష్ట్రాల్లో కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి.
 
అలా హైదరాబాద్‌లో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేసిందన్నారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని ఆయన అన్నారు. ఏదైనా దారుణం జరిగితే కానీ, మనలో చలనం రావడం లేదన్నారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా అని అసహనం వ్యక్తంచేశారు. 
 
ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని... అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని... మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని మండిపడ్డారు. 
 
ఆడపిల్లలు బయటకు వెళ్తే వారిని వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తనకు తెలుసని పవన్ చెప్పారు. అమ్మాయిలు ఇంటికి చేరేంత వరకు భయపడుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు 200 మంది యూనిట్ సభ్యులం ఉన్నామని... అయినా బయటివారు వచ్చి, సినిమాకి సంబంధించిన అమ్మాయిలను వేధించారని... అప్పుడు తాను కర్ర పట్టుకోవాల్సి వచ్చిందన్నారు. 
 
అంతకుముందు ఆయన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జాతీయ స్థాయి వికలాంగుల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఆటగాళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ టోర్నీకి తన వంతు ధన సహాయం చేశారు. తొలి మ్యాచ్ తెలంగాణ, వడోదర జట్ల మధ్య జరగబోతోంది. జాతీయ స్థాయిలో ఈ టోర్నమెంట్ రెండోసారి జరుగుతోంది. ఈ పోటీలకు 24 రాష్ట్రాల నుంచి జట్లు హాజరయ్యాయి. టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరైన పవన్‌ను చూసి భారీ ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు కేరింతలు కొట్టారు.