శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (14:45 IST)

అసంతృప్త ఎమ్మెల్యేలను గుర్తించి లాక్కురండి : యడ్యూరప్ప

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలను గుర్తించి వారిని పట్టుకుని లాక్కురండి అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడ్యూరప్ప పార్టీ శ్రేణులను ఆదేశించారు.

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలను గుర్తించి వారిని పట్టుకుని లాక్కురండి అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడ్యూరప్ప పార్టీ శ్రేణులను ఆదేశించారు.
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'మనం అధికారంలోకి వస్తామని ప్రజలు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీనికి తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. వెళ్లండి.. కాంగ్రెస్, జేడీఎస్‌లోని అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్లండి. వారిని బీజేపీలోకి తీసుకురండి. కర్ణాటక సహా దేశాభివృద్ధి కోసం తపన పడే వారిని మనందరం కలిసి ఆహ్వానిద్దాం' అంటూ పిలుపునిచ్చారు. 
 
కాగా, ఇటీవల వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి కొద్దిదూరంలో ఆగిపోయిన విషయం తెల్సిందే. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, బీజేపీ మాత్రం అధికారంపై ఇంకా ఆశలు పెట్టుకునివుంది. 
 
అందుకే యడ్యూరప్ప వీలు చిక్కినప్పుడల్లా సంకీర్ణ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం విషయంలో తాము చాలా సహనంగా ఉన్నామని, కూలిపోవాలని కోరుకోవడం లేదని వెల్లడించారు. కాంగ్రెస్-జేడీఎస్‌లు అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయని, ఈ ప్రభుత్వం ఐదేళ్లూ నిబడటం కష్టమని జోస్యం చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.