శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (08:55 IST)

'మేం మీ అభిమానులం' అంటూ పోటీపడి ఫోటోలు దిగిన ఎంపీలు.. ఎవరితో?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినలో మకావేసివున్నారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయ పార్టీలకు వివరించడంతో పాటు నమ్మించి మోసం చేసిన బీజేపీ వైఖరిని ఆయన జాతీయ పార్ట

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినలో మకావేసివున్నారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయ పార్టీలకు వివరించడంతో పాటు నమ్మించి మోసం చేసిన బీజేపీ వైఖరిని ఆయన జాతీయ పార్టీ నేతలకు వివరిస్తున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా నవ్యాంధ్రకు జరిగిన అన్యాయాన్ని వినిపించారు. "ఇదీ మా కష్టం! కేంద్రం వల్ల జరిగిన నష్టం! మోదీ సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం" అంటూ ఎలుగెత్తి చాటారు. 
 
అనేక పార్టీల ముఖ్య నేతలు నవ్యాంధ్ర జరుపుతున్న పోరుకు మద్దతు ప్రకటించారు. మంగళవారం పార్లమెంటd సెంట్రల్‌ హాలులో వివిధ పార్టీలకు చెందిన 20 మంది ముఖ్య నాయకులను చంద్రబాబు కలిశారు. ఎన్డీయేలోని భాగస్వామ పార్టీలతోపాటు యూపీఏ, వామపక్ష పార్టీల నేతలనూ ఆయన కలిశారు. 
 
సీఎంను కలిసిన వారిలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ఆయన కుమార్తె సుప్రియా సూలే, ఆ పార్టీ నేత తారిక్‌ అన్వర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, డెరెక్‌ ఒబ్రెయిన్‌, అకాలీదళ్‌ నేతలు హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, నరేశ్‌ గుజ్రాల్‌, బీజేపీ మిత్రపక్షమైన శివసేన నేత సంజయ్‌ రావత్‌తోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు చంద్రబాబును కలిసి ఏపీ డిమాండ్లకు మద్దతు పలికారు. 
 
అలాగే, బీజేడీ ఎంపీలు తథాగథ్‌ శతపథి, జయ్‌ పాండా, సమాజ్‌వాదీ పార్టీ నేతలు రాంగోపాల్‌ యాదవ్‌, ధర్మేంద్రయాదవ్‌, సీపీఎం నేత రంగరాజన్‌, సీపీఐ నాయకుడు డి.రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, ఆర్జేడీ నేతలు ప్రేమచంద్‌ గుప్తా, జేడీయూ నేత త్యాగి, డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీలైన కనిమొళి, మైత్రేయన్‌, నవనీత కృష్ణన్‌లు ఉన్నారు. 
 
ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలు వీరప్ప మొయిలీ, జ్యోతిరాదిత్య సింధియా తొలుత ఆయనను కలుసుకున్నారు. బీజేపీ నుంచి బయట పడినందుకు అభినందించారు. ఆ తర్వాత సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ వచ్చి చంద్రబాబుకు అభివాదం చేశారు. ఏపీ విభజన చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేశ్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ, ఎంపీ సుబ్బిరామిరెడ్డిలు ఉన్నారు. 
 
అయితే, ఈ పర్యటనలో ఓ ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు యువ ఎంపీలు చంద్రబాబును కలిసేందుకు ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించారు. 'మేం మీ అభిమానులం' అంటూ ఫొటోలు దిగారు. అలా తొలిరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన బుధవారం కూడా ఢిల్లీలోనే ఉంటూ వివిధ పార్టీల నేతలతో మంతనాలు జరుపనున్నారు.