శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By TJ
Last Modified: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:24 IST)

మంత్రి నారా లోకేష్ మళ్లీ అలా బుక్కయ్యారే.‌.. నవ్వాలో లేదంటే..?

తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తలలో ఉండే ఎపి సిఎం తనయుడు, యువ మంత్రి నారా లోకేష్‌ మళ్ళీ నోరు జారారు.

తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తలలో ఉండే ఎపి సిఎం తనయుడు, యువ మంత్రి నారా లోకేష్‌ మళ్ళీ నోరు జారారు. గతంలో వర్థంతి... జయంతి అంటే ఏంటో తెలియక కన్ఫూజైన లోకేష్ తాజాగా తిరుపతి పర్యటనలో తండ్రి సమక్షంలో సరికొత్త లెక్కలు చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఇంతకీ నారా లోకేష్‌ చెప్పిన లెక్కలేమిటి.. లోకేష్‌ చూపిన ప్రావీణ్యం ఏమిటి...?
 
ఏపీ రాజకీయాల్లో నారా వారసుడు లోకేష్ రూటే సపరేటు. తండ్రి చంద్రబాబునాయుడు సపోర్ట్‌తో ఏకంగా మంత్రి అయిన లోకేష్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చేసే ప్రసంగాలలో అడపాదడపా దొర్లుతున్న కొన్ని మాటలు ఆయన్ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తున్నాయి. గతంలో మంత్రి కాకముందు దేశంలోనే అవినీతి, బంధుప్రీతి ఉన్న పార్టీ టిడిపి అవునా.. కాదా అంటూ ఏమరపాటుగా వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న నేతలు బెంబేలెత్తిపోయారు. 
 
ఆ తరువాత మంత్రి అయ్యాక కూడా తన పంథాను మాత్రం వదులుకోవడం లేదు. అంబేద్కర్ జయంతిని వర్థంతి అని మరోసారి మీడియాకు, ప్రతిపక్షాలకు దొరికిపోయారు. అలాగే మరో సంధర్భంలో ఎపిలోని 175 నియోజకవర్గాల్లో టిడిపి 200 ఎమ్మెల్యే సీట్లు గెలవాలని తనదైన శైలిలో వ్యాఖ్యానించి టిడిపి నేతలు ఇబ్బందిపడేలా చేశారు. దీంతో ప్రసంగాలకు ఆయన్ను దూరంగా పెడుతూ వచ్చారు చంద్రబాబు. ఈ మధ్యకాలంలో సభలకు వెళ్ళినా పెద్దగా మాట్లాడని లోకేష్‌ చాలాకాలం తరువాత తిరుపతి పర్యటనకు వచ్చిన లోకేష్‌ తన తండ్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచేశారు. 
 
ప్రపంచానికే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన లోకేష్‌ ప్రసంగం మధ్యలో మాట్లాడిన కొన్ని పదాలు సభలో ఉన్న వారిని ఉలిక్కిపడేలా చేశాయి. దేశవ్యాప్తంగా వంద పరిశ్రమలు ఉంటే అందులో 250 పరిశ్రమలు ఎపిలోనే ఉంటాయని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. గణిత శాస్త్రం ప్రకారం వందలో రెండు వందల యాభై ఎలా కలపారో తెలియక సతమతమయ్యారు. అయితే లోకేష్‌ మాత్రం ఇదేం పట్టించుకోకుండా తనదైన శైలిలో ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలో సెల్ ఫోన్ వచ్చాక ఎపిలో మాత్రం అదేంటో ఎవరికీ తెలియదని తెలుగువారికి చంద్రబాబే సెల్ ఫోన్లను పరిచయం చేశారని తన తండ్రిని పొగడ్తలతో ముంచేశారు. 
 
అలాగే దేశంలో 100 ఫోన్లు తయారైతే.. ఒక్క ఎపిలో 260 ఫోన్లు తయారవుతాయని చెప్పి నాలుక కరుచుకున్నారు. అయితే సభ ముగిసినా లోకేష్ బాబు లెక్కల్లో అంతరార్థం తెలియక ఆలోచనలో పడిపోయారు అక్కడున్న మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు. మంత్రి అంటే ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. ప్రజలు ఏది అడిగినా సమాధానం చెప్పాలి. కానీ లోకేష్‌ అవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్నదే మాట్లాడి వెళ్ళిపోతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.