శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (13:07 IST)

ఏదో ఒక రోజుకి పవన్ కల్యాణ్‌ని మర్చిపోవాలి... ఎందుకు?

జనసేన సైనికులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ముఖ్యమైన పిలుపునిచ్చారు. ఏదో ఒక రోజున తనను మరిచిపోవాలని సూచించారు. తనను తలుచుకోవడంమానేసి కేవలం పార్టీ పేరునే తలుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. అంటే... జనసే

జనసేన సైనికులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ముఖ్యమైన పిలుపునిచ్చారు. ఏదో ఒక రోజున తనను మరిచిపోవాలని సూచించారు. తనను తలుచుకోవడంమానేసి కేవలం పార్టీ పేరునే తలుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. అంటే... జనసేన పార్టీయే గుర్తుండాలన్నదే తన కోరిక అన్నారు.
 
విశాఖపట్టణం నగరంలో జరిగిన జనసేన కార్యకర్తల, నాయకుల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రేమతో వచ్చే వాళ్లని, డబ్బులిస్తే వచ్చే వాళ్లు కాదన్నారు. జనసైనికుల భావావేశాలను నాయకులు అర్థం చేసుకోవాలని, వాళ్ల ఉత్సాహం కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినప్పటికి, వాళ్లు చూపే ప్రేమ ఎనలేనిదని కొనియాడారు.
 
తాను 25 కోట్ల రూపాయల పన్ను చెల్లించే స్థాయిని వదులుకుని మీకోసం వచ్చినట్టు చెప్పారు. మీ కోసం వచ్చాను. మీరు లేకపోతే జనసేన లేదు. భావజాలం ముఖ్యం కానీ, వ్యక్తులు కాదు. ఏదో ఒక రోజుకి పవన్ కల్యాణ్‌ని మర్చిపోయి.. జనసేన పార్టీయే గుర్తుండాలనేది నా కోరిక. ‘జనసేన’ భావజాలం అందరిలో బలంగా నాటుకుపోవాలి అని పవన్ పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో టీడీపీ నేతలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అంటూ ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే పరిధికి లోబడే నడుచుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే... చేతులు కట్టుకుని కూర్చోబోమని... పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరించారు.
 
అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని... పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ చెప్పారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో తలరాతలు మార్చేయవచ్చని తెలిపారు. తెలంగాణలో ఓ పెన్ను పోటుతో ఉత్తరాంధ్రకు చెందిన 23 వెనుకబడిన కులాలను జాబితా నుంచి తొలగించారని... అదేవిధంగా ఏపీలో టీడీపీ నేతల సంతకాలతో ప్రజల తలరాతలు మారిపోతున్నాయని చెప్పారు. 
 
మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని అన్నారు. తప్పు చేస్తున్నవారిని తానెందుకు ప్రశ్నించకూడదని నిలదీశారు. అదేసమయంలో తన పార్టీకి కులం పేరును ఆపాదిస్తే మాత్రం కాళ్లు విరగ్గొట్టడం ఖాయమని పవన్ హెచ్చరించారు.