శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (17:58 IST)

ప్రధాని మోడీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది : శివసేన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న శివసేన ప్రధాని మోడీ వైఖరినచ్చక ఆ కూటమి నుంచి వైదొలగి, వచ్చే ఎన్నికల్లో స్వ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న శివసేన ప్రధాని మోడీ వైఖరినచ్చక ఆ కూటమి నుంచి వైదొలగి, వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా, ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆ కూటమి నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రిపదవులకు రాజీనామాలు చేయనున్నారు. 
 
ఈ పరిణామాలన్నింటిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, ఎన్డీయే నుంచి ఇక ఒక్కొక్క పార్టీ బయటపడుతుందన్నారు. ఈ పరిణామాలను శివసేన ముందుగానే ఊహించిందన్నారు. ఇతర పార్టీలు కూడా ఎన్డీయే నుంచి బయటికొస్తాయన్నారు. మిత్ర పక్షాలను బీజేపీ గౌరవించడం లేదన్నారు. బీజేపీతో మిత్రపక్షాల సత్సంబంధాలు ఇక ఎంతోకాలం కొనసాగబోవని జోస్యం చెప్పారు. క్రమంగా ఆ పార్టీల ఆగ్రహం పెచ్చుమీరుతుందని, అంతిమంగా కూటమి నుంచి వెళ్ళిపోతాయని అన్నారు. 
 
బీజేపీ తన మిత్రపక్షాలను గౌరవించడం లేదని శివసేనకు చెందిన మరో ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని తెలుసుకుంటోందన్నారు. తాము ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నామన్నారు. అందరినీ కలుపుకుంటామని బీజేపీ చెప్తూ ఉంటుందని, కానీ విధానాలను నిర్ణయించేటపుడు అటువంటి ప్రయత్నాలేవీ చేయదని ఆయన విమర్శలు గుప్పించారు.