శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (10:37 IST)

సుప్రీం చీఫ్ జస్టీస్‌పై అభిశంసన : తిరస్కరించిన ఉపరాష్ట్రపతి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణులతో చర్చించిన

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలో ఆరు ప్రతిపక్ష పార్టీలు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణ రీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. 
 
ఈ అంశంపై ఆయన సుదీర్ఘంగా న్యాయ కోవిదులపై చర్చలు జరిపారు. ఇందుకోసం ఆయన ఆదివారం తన హైదరాబాద్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. నిజానికి సోమవారం ఆయన హైదరాబాదులో జరుగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసుపై సత్వర పరిష్కారానికి న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఆయన సంప్రదింపులు జరిపారు. 
 
ఇందులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌, మాజీ అటార్నీ జనరల్‌ కె.పరాశరన్‌ తో పాటు లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పి.కె.మల్హోత్రా, శాసన వ్యవహారాల మాజీ కార్యదర్శి సంజయ్‌ సింగ్‌, రాజ్యసభ సచివాలయంలోని సీనియర్‌ అధికారులను అందుబాటులో ఉన్నారు. 
 
వీరందరితో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశం రాత్రి బాగా పొద్దుపోయేవరకు జరగడం విశేషం. ఆ తర్వాత ఆయన సోమవారం ఉదయం అభిశంసన నోటీసును తిరస్కరించారు. కాగా, చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను తొలగించాలని కోరుతూ 64 మంది సిట్టింగ్‌ ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును 7 పార్టీల ప్రతినిధులు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడికి సమర్పించిన సంగతి తెలిసిందే. 
 
కాగా, చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రాపై విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఓసారి పరిశీలిస్తే, 
* ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు.
 
* సుప్రీంకోర్టులో ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం. 
 
* రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.
 
* న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్‌ చేశారు. అయితే 1985లోనే ప్లాట్‌ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు.
 
* తనకున్న మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు. ఇలాంటి పలు అభియోగాలను విపక్ష పార్టీలు మోపాయి.