1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:05 IST)

ఇకపై వర్క్ ఫ్రమ్ హోం ... కార్మిక చట్టాన్ని సవరించే పనిలో... (video)

ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ముఖ్యంగా, వైరస్ బారినపడకుండా ఉండేందుకు అనేక దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ కారణంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాయి. ఇదే సౌకర్యాన్ని మున్ముందు కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ వర్క్ ఫ్రం హోం విధానం కరోనా విపత్తు తొలగిపోయిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ముందే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వర్క్ ఫ్రం హోంకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉందని సమాచారం. ముఖ్యంగా ఉద్యోగుల పనిగంటలు, పని వాతావరణం, వేతనం మొదలైన వాటిపై కేంద్రం తన మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
వర్క్ ఫ్రం హోంకు సంబంధించి ప్రస్తుత కార్మిక చట్టంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.