శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:01 IST)

బీజేపీ సీఎం కాన్వాయ్‌లో రూ.2 కోట్ల నగదు సీజ్

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఎన్నికల బందోబస్తు బలగాలు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ రాష్ట్ర సీఎంగా పెమా ఖండు, ఉప ముఖ్యమంత్రిగా సీఎం చౌనామేలు ఉన్నారు. వీరి కాన్వాయ్‌ను  భద్రతా బలగాలు తనిఖీ చేశాయి. ఆ సమయంలో ఓ కారులో రహస్యంగా తరలిస్తున్న రూ.1.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇపుడు కలకలం సృష్టిస్తోంది. 
 
మంగళవారం అర్థరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది. ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం పెమా ఖండు, డిప్యూటీ సీఎం చౌనా మేతోపాటు ప్రధాని నరేంద్ర మోడీపైనా కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. తక్షణం సీఎం, డిప్యూటీ సీఎంలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
పసిఘాట్‌‌లో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. బుధవారం ఉదయమే అక్కడ ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ప్రధాని ర్యాలీ కోసమే ఈ డబ్బులు తరలించారా అని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఈశాన్య ఓటర్లను డబ్బు ఆశ చూపించి బీజేపీ వలలో వేసుకుంటున్నదని సూర్జేవాలా ఆరోపించారు. 
 
ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల సమక్షంలో సీఎం కాన్వాయ్ నుంచి డబ్బు రికవరీ చేస్తున్న రెండు వీడియోలను సూర్జేవాలా మీడియాకు రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తమకు లభించాయని ఆయన చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ డబ్బు పంచే కార్యక్రమానికి తెర తీసిందని సూర్జేవాలా విమర్శించారు. ఏకంగా సీఎం కాన్వాయ్ నుంచే ఈ డబ్బు పట్టుబడటం అరుణాచల్‌లో సంచలనం సృష్టించింది.