మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 23 నవంబరు 2017 (18:53 IST)

జగన్ వల్ల రాష్ట్రానికి అప్రదిష్ట... మంత్రి కళా వెంకట్రావు

అమరావతి: ప్రపంచంలో ఆర్థిక నేరం ఎక్కడ జరిగినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు బయటకొస్తోందని, అటువంటి వ్యక్తి వల్ల రాష్ట్రానికి అప్రదిష్ట కలుగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావ్ మండిపడ్డారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గుర

అమరావతి: ప్రపంచంలో ఆర్థిక నేరం ఎక్కడ జరిగినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు బయటకొస్తోందని, అటువంటి వ్యక్తి వల్ల రాష్ట్రానికి అప్రదిష్ట కలుగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావ్ మండిపడ్డారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ అవినీతి మూలాలు రోజుకొకటి బయటపడుతున్నాయన్నారు. ఇప్పటికే అక్రమ కేసులో కోర్టుల చుట్టూ జగన్ తిరుగుతున్నారన్నారు. 
 
నిన్నటికినిన్న ప్యారడైజ్ పేపర్లలో ప్రతిపక్ష నేత పేరువచ్చిందన్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన 12 మందితో కూడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాబితాపై ద టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో గురువారం ఒక కథనం వచ్చిందన్నారు. 12 మందిలో జగన్ పేరు పదో నెంబర్‌గా ఆ జాబితాలో ఉందన్నారు. 31 షెల్ కంపెనీల్లో రూ.368 కోట్లు మనీ ల్యాండరింగ్ చేసినట్లు ఆ వార్తా కథనం పేర్కొందన్నారు. 
 
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని లూటీ చేసి అతి పెద్ద ఆర్థిక ఉగ్రవాదిగా తయారయ్యారనీ, ఇలా ప్రపంచంలో ఆర్థిక నేరం ఎక్కడ జరిగినా దాంట్లో జగన్ పేరు బయటపడుతోందన్నారు. ప్రతిపక్ష జగన్ వల్ల రాష్ట్రానికి అప్రదిష్ట కలుగుతోందన్నారు. ఇటువంటి ఆర్థిక నేరాల్లో శిక్షలు తప్పించుకోడానికే జగన్ పాదయాత్ర పేరుతో డ్రామాకు తెర తీశారన్నారు. 
 
ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటీషన్‌ను సిబిఐ కోర్టు తిరస్కరించిందన్నారు. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారోనని కూడా జగన్ పట్టించుకోవడం లేదన్నారు. చిన్నాన్న రాజీనామా విషయంలో వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందేన్నారు, రాజకీయ జీవితంలో జగన్ ఏనాడూ నైతిక విలువలు పాటించిన పాపాన పోలేదన్నారు. స్వయాన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత జగన్‌ను అప్పట్లో అదుపులో పెట్టలేకపోయారన్నారు. 
 
జగన్ డిక్షనరీలో ఏనాడూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన సందర్భం లేదన్నారు. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు రాజకీయ ముసుగులో జైలు శిక్షల నుంచి తప్పించుకోడానికి చూస్తున్నారన్నారు. కొందరు నేతలు మరో దారి లేక జగన్ వెంట ఉంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయ గమనం, వ్యక్తిగత నడకపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.