శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (06:41 IST)

పడవ ప్రయాణంలో విషాదం.. 16 మంది మృతి... విచారణకు ఆదేశం

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సింపుల్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 38 మంది ప్రయాణికులు ఉన

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సింపుల్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 16 మంది మృత్యువాతపడ్డారు. 9 మంది గల్లంతయ్యారు. మిగిలినవారిని సహాయక సిబ్బంది రక్షించారు. 
 
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫెర్రీఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు పర్యాటకులతో విహార యాత్ర నిర్వహించేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో నిత్యం పర్యాటకులు కృష్ణానదిలో విహార యాత్రకు వస్తున్నారు. పర్యాటక సంస్థ సిబ్బంది బోటులో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. 
 
కాగా, ఫెర్రీఘాట్‌ వద్ద జరిగిన పడవ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కలెక్టర్‌, డీజీపీ, మంత్రులను ఆదేశించారు. బాధితుల్లో ఎక్కువ మంది ఒంగోలు వాసులు ఉన్నారు. 
 
మరోవైపు, పడవ ప్రమాదంపై పర్యాటకశాఖ మంత్రి భూమా అఖలిప్రియ విచారం వ్యక్తం చేశారు. రివర్‌ బోటింగ్‌ సంస్థపై విచారణకు మంత్రి ఆదేశించారు. భవానీ ద్వీపం నుంచి పడవ ఎప్పుడు బయలుదేరిందనే విషయంపై మంత్రి ఆరా తీశారు. సమాచారం కోసం 0866 2478090కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. ఆరు మృతదేహాలను విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒంగోలు వాసులు కావడంతో పడవ ప్రమాదంపై ప్రకాశం జిల్లాలో టోల్‌ఫ్రీ నంబర్‌ 08592 281400 ఏర్పాటు చేశారు. ఒంగోలు నుంచి అధికారుల బృందం ఘటనాస్థలికి బయలుదేరింది. ఒంగోలు ఆర్డీవో, ఆరుగురు తహశీల్దార్లు, మత్స్యశాఖ అధికారులు ఘటనా స్థలికి బయల్దేరిన వారిలో ఉన్నారు. కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌కు చెందిన 60 మంది రెండు బస్సులో అమరావతి విచ్చేశారు. అక్కడి నుంచి పవిత్రసంగమం వద్ద నిత్యహారతి వీక్షించేందుకు 32 మంది పర్యాటక బోటులో బయల్దేరారు. ఫెర్రీఘాట్‌ వద్దకు రాగానే పడవ ప్రమాదానికి గురై పెను విషాదం మిగిల్చింది.
 
ఇదిలావుండగా, పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.