శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (21:22 IST)

మూడు నెలల్లో మధుమేహం మాయం... అమరావతిలో వైద్యుడు కాని వైద్యుడి సలహా

అమరావతి : ఆహారంలో మార్పుల ద్వారా మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులను నయం చేయవచ్చని వీరమాచనేని రామకృష్ణ చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్ సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆహారం

అమరావతి : ఆహారంలో మార్పుల ద్వారా మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులను నయం చేయవచ్చని వీరమాచనేని రామకృష్ణ చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్ సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆహారం తీసుకోవడంలో విచ్చలివిడితనం వల్ల ఇటువంటి వ్యాధులు వస్తాయని చెప్పారు. ఆహారంలోనే మందులు ఉన్నాయని, మనం తినే ఆహారంలో మార్పు ద్వారా వీటిని నయం చేసుకోవచ్చని సూచించారు. తను డాక్టర్‌ని కాకపోయినా పరిశోధన చేసిన, మన ప్రాంతానికి అనుకూలమైన ఆహార కార్యక్రమాన్ని రూపొందించి, తన స్వానుభవంతో ఫలితాలు పొందానని తెలిపారు. 
 
ఈ విధానం ద్వారా లక్షల మంది ఫలితాలు చవిచూశారని చెప్పారు. మూడు నెలల ఈ కార్యక్రమంలో అనేక వ్యాధులు నయమవుతాయని నిరూపణ అయిందన్నారు. ఊబకాయం ఓ వ్యక్తి ఉన్న శరీర బరువును బట్టి పది నుంచి 40 రోజులలోపు తగ్గుతుందని చెప్పారు. శరీర బరువు తగ్గగానే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయచ్చని, ఆ తరువాత పిండిపదార్ధాలు తగ్గించి సాధారణ ఆహారం తీసుకోవచ్చని తెలిపారు. మధుమేహం ఉన్నవారు మాత్రం మూడు నెలలు ఈ విధానాన్ని అనుసరించవలసి ఉంటుందని చెప్పారు. 
 
ప్రకృతే మనకు పెద్ద డాక్టర్ అని, ప్రకృతే చాలా వ్యాధులను నయం చేస్తుందన్నారు. ఉదయం మొదలు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు(పిండిపదార్ధాలు) ఎక్కవగా ఉంటాయని తెలిపారు. పిండి పదార్ధాలు, రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయని చెప్పారు. ఈ విధానాన్ని అనుసరించి లక్షల మంది ప్రయోజనం పొందారని, వారిలో డాక్టర్లు కూడా ఉన్నారని తెలిపారు. తను ఎవరి వద్ద నయాపైసా తీసుకోకుండా, సొంత ఖర్చులతో తిరుగుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉచితంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
 
ఆహార నియమాలను పాటించే ఈ విధానం ద్వారా ప్రకృతికి దగ్గరవుతామని, రోగాలకు దూరమవుతామని తెలిపారు. యూ ట్యూబ్‌లో త్వరలో సొంత ఛానల్ ద్వారా ఈ విధానాన్ని తెలియజేస్తానని, అందరి అనుమానాలను నివృత్తి చేస్తానని, ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని చెప్పారు. ఈ విధానంలో వంటలకు వాడే కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మీగడ, వెన్న, ఛీజ్, సముద్రపు ఉప్పు వాడాలని చెప్పారు. 
 
శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరికీ అనుకూలమైన రీతిలో నాలుగు పిల్లర్స్‌గా ఈ ప్రోగ్రామ్‌ని రూపొందించినట్లు రామకృష్ణ  వివరించారు. ఈ సదస్సులో సచివాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానాలు చెప్పారు. ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నవారు తమకు ఒక్క రోజులోనే మధుమేహం తగ్గినట్లు రీడింగ్ వివరాలతో సహా తెలిపారు. మూడు నెలల వరకు కొనసాగిస్తామని చెప్పారు. ఊబకాయం పది రోజుల్లో తగ్గినట్లు కొందరు తెలిపారు. ఈ సదస్సులో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ , ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.