శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (10:01 IST)

సేవ - ధ్యానం ముసుగులో లైంగిక వేధింపులు.. బీటెక్ విద్యార్థినికి దొంగ బాబా కుచ్చుటోపీ

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో మరో దొంగబాబా గుట్టురట్టయింది. సేవా, ధ్యానం ముసుగులో అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న బాబా బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ బాబా చేతిలో మోసపోయిన యువతుల్లో బీటెక్ విద్యార్థిని కూడా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్ నగర శివారులో ఓమౌజయా మహా విభో శ్రీ గురూజీ 2009లో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు. సేవ, ధ్యానం పేరుతో 2010 నుంచి కార్యక్రమాలు ప్రారంభించారు. 2012లో 20 మంది.. 2014లో దాదాపు 60 మంది యువతులు చేరారు. వీరందరినీ బలవంతంగా సన్యాసినులుగా మార్చినట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో నిర్మల్‌కు చెందిన కమలాధర్‌, మంగమ్మలకు ఒక కూతురు చందన (24)తోపాటు ఒక కొడుకు ఉన్నారు. కొడుకుకు అనారోగ్యంగా ఉంటుండటంతో తెలిసిన వారు ఇచ్చిన సమాచారంతో ఓమౌజయా ఆశ్రమ నిర్వాహకుడు జైమహా విభశ్రీని కలిశారు.
 
కొడుకు ఆరోగ్యం బాగు కావాలంటే కూతురిని ఆశ్రమంలో చేర్పించాలని షరతు పెట్టాడు. ఆమె భవిష్యత్తుపై మాయమాటలు చెప్పాడు. దాంతో చందన తల్లిదండ్రులు అంగీకరించారు. బీటెక్‌ పూర్తి చేసిన చందనను ఆగస్ట్‌ 26న ఆశ్రమంలో చేర్పించారు. ఆమె బ్యాంకు ఖాతాలో రూ.6 లక్షలు ఉంటే వాటిని తమ ఖాతాలోకి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. 15 రోజుల తర్వాత చందన తల్లిదండ్రులు వచ్చారు. 
 
తమ కుమార్తెతో ఫోనులో అయినా మాట్లాడాలని కోరారు. ఇందుకు ఆశ్రమ నిర్వాహకులు అంగీకరించలేదు. దాంతో తీవ్ర ఆగ్రహనికి లోనైన మంగమ్మ ఆశ్రమం వద్ద ఆందోళన చేసింది. అయినా ఫలితం లేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా, చందనను చూపించడానికి నిర్వాహకులు ససేమిరా అన్నారు.
 
ఆశ్రమంలోని ఉన్నతస్థాయి వ్యక్తులతో పోలీసులు చర్చించగా.. చందన కీసర ఆశ్రమంలో లేదని, బోయిన్‌పల్లిలోని మరో ఆశ్రమంలో ఉందని తెలిపారు. పోలీసులు వెంటనే బోయిన్‌పల్లికి వెళ్లి చందనను తీసుకొచ్చి మంగమ్మకు ఆదివారం రాత్రి అప్పగించారు. మరో ఇద్దరు యువతులను కూడా ఆశ్రమవాసుల చెర నుంచి రక్షించారు. ఈ ఆశ్రయ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు.