బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (21:51 IST)

జగన్‌ నరరూప రాక్షసుడు: చంద్రబాబు

సీఎం జగన్‌ ఒక నరరూప రాక్షసుడు అంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాలకొల్లులో జరిగిన సభలో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

జగన్‌ ఏదో పొడిచేస్తాడని అవకాశం ఇచ్చారని.. తీరా ఒక్క అవకాశం అని కరెంట్‌ తీగలు పట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గుడు అమరావతిని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. అమరావతి తన కోసం కాదని.. ప్రజల కోసమని చెప్పారు.

దురదృష్టవశాత్తు విభజన జరిగి హైదరాబాద్‌ తెలంగాణకు పోయిందన్నారు. మనకు హైదరాబాదే గతి అవుతుందని ఆనాడే చెప్పానన్నారు. 7 నెలల్లో రాష్ట్రంలో ఒక తట్ట మట్టి కూడా వేయలేదని ఆరోపించారు.
 
‘సోమవారాన్ని పోలవారంగా చేయాలనుకున్నాం. ఇప్పుడు జగన్‌.. శుక్రవారాన్ని జైలువారంగా చేశాడు. మనసున్న వాడెవడూ అమరావతిని చంపాలనుకోడు. అమరావతిలో చిన్న ఇటుకను కూడా కదిలించే శక్తి జగన్‌కు లేదు. జగన్‌ దొంగలెక్కలు రాసి అడ్డంగా డబ్బులు కొట్టేశాడు.

కామధేనువుని అప్పగిస్తే చంపాలనుకున్న దుర్మార్గుడు జగన్‌. ఇప్పుడు నేను కట్టిన బిల్డింగుల్లోనే ఉంటున్నారని గుర్తుంచుకోండి. అమరావతి ప్రాజెక్ట్‌ నుంచి సింగపూర్‌ని పంపించివేశారు. ప్రపంచంలోనే అవినీతి లేని ప్రభుత్వం సింగపూరే. ఇవాళ అమరావతి రైతులకు జరిగిందే.. రేపు అందరు రైతులకు జరుగుతుంది.

వైఎస్‌ చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేసిన జగన్‌.. రాజధాని కోసం 20 మంది చనిపోతే ఎందుకు పరామర్శిచలేదు. జగన్‌ అమరావతి ప్రకటన చేయకపోతే.. 20 మంది ప్రాణాలు పోయేవి కాదు’ అన్నారు.