గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (10:41 IST)

వైద్యుల నిర్లక్ష్యం.. ప్రసవం సమయంలో శిశువు తల తెగింది..

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. ప్రపంచాన్ని చూడకముందే అనంతలోకాలను తీసుకెళ్లింది. ప్రసవ సమయంలో శిశువు తల తెగడంతో ప్రాణాలు కోల్పోయింది. గర్భాశయంలోనే మొండెం చిక్కుకుపోవడంతో తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనగా ఉంది. కల్పాక్కం సమీపంలోని కడలూరుకు చెందిన బొమ్మి (28)ని బుధవారం ఉదయం ప్రసవం కోసం కూవత్తురు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
 
ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంలో నర్సులే ప్రసవం చేయడానికి సిద్ధపడ్డారు. ఆపరేషన్ థియేటర్‌లో ప్రసవం చేస్తున్న సమయంలో కొద్దిగా బయటకు వచ్చిన శిశువు తలను బలంగా లాగారు. దాంతో శిశువు తల తెగిపోయింది. మొండెం మాత్రం తల్లి గర్భాశయంలోనే ఉండిపోయింది. భయాందోళన చెందిన నర్సులు ఆసుపత్రి డాక్టర్లకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 
 
బొమ్మిని వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుండి దేహాన్ని బయటకు తీసారు. ఇప్పుడు బొమ్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులు, విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రి ముందు దర్నాకి దిగారు.