శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (13:25 IST)

శ్మశానంలో నిద్రించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే.. ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు శ్మశానంలో నిద్రించారు. ఆయన పేరు నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ శాసనసభ్యుడు. ఆయన ఒక రోజంతా శ్మశాన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు శ్మశానంలో నిద్రించారు. ఆయన పేరు నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ శాసనసభ్యుడు. ఆయన ఒక రోజంతా శ్మశానంలో నిద్రపోవడాని గల కారణాలు లేకపోలేదు.
 
పాలకొల్లు శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ, శ్మశానాన్ని బాగుచేయడానికి నిధులు ఖర్చు చేయలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు. ఈ విషయాన్ని పలుమార్లు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. పైగా, శ్మశానంలో వర్కర్లు పని చేయడానికి భయపడిపోతున్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు, వర్కర్లలో భయం పోగొట్టేందుకు ఎమ్మెల్యే శ్మశానంలో ఒక రోజంతా గడిపారు. 
 
ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సమయంలో శ్మశానికి వెళ్లిన రామానాయుడు.. రాత్రి అక్కడే భోజనం చేసి.. రాత్రిక అక్కడే పనుకున్నారు. శనివారం ఉదయం నిద్రలేచి అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ మధ్యాహ్నం తిరిగివచ్చారు. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో గమనించారు. తాను మరో రెండు మూడు రోజులు అక్కడే పడుకుంటానని ఆయన స్పష్టంచేశారు. 
 
అక్కడ పనిచేయడానికి భయపడుతున్న వాళ్లలో ధైర్యం నింపడానికే తానీ పని చేసినట్లు రామానాయుడు చెప్పారు. ఇక్కడి హిందూ శ్మశాన వాటికలో ఎన్నో ఏళ్లుగా సరైన వసతులు లేవు. దీంతో ఎనిమిది నెలల కిందట శ్మశానం అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయినా పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. రెండు నెలల కిందటే ఓ కాంట్రాక్టర్ దొరికినా.. అక్కడి పనివాళ్లు మాత్రం పనులు చేయడానికి భయపడుతున్నారు.
 
కొన్ని రోజుల కిందట అక్కడ సగం కాలిన శవం కనిపించడంతో దెయ్యాల భయానికి పనివాళ్లు రావడం మానేశారు. దీంతో ఇక తానే రంగంలోకి దిగి వాళ్ల భయాన్ని పోగొట్టాలనుకున్న ఎమ్మెల్యే ఇలా రాత్రిపూట అక్కడ పడుకోవడం ప్రారంభించారు. ఈ ట్రిక్ పనిచేసిందని, శనివారం 50 మంది కార్మికులు పనిచేయడానికి వచ్చారని ఆ ఎమ్మెల్యే చెప్పారు. దోమలు, కాలిన శవాల వాసన వల్ల తప్ప తనకు ఇంకేమీ ఇబ్బంది కలగలేదని ఎమ్మెల్యే రామానాయుడు చెప్పుకొచ్చారు.