శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

నా శవాన్ని నలుగురు మోసేవరకు రాజకీయాల్లో ఉంటా : పవన్ కళ్యాణ్

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయారు. కానీ, ఒక్క చోట గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరపున అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 
 
ఈ క్రమంలో ఓటమికిగల కారణాలపై పవన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, వివిధ జిల్లాలలకు చెందిన నేతలు రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆయన్ను కలుస్తున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ, ఓటములు తనకు కొత్తేమీ కాదన్నారు. దెబ్బతినే కొద్దీ తాను ఎదిగే వ్యక్తినని చెప్పారు. 2014లో తెలంగాణాలో పార్టీ పెట్టాను. పాతిక సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెట్టినట్టు చెప్పారు. 
 
తాను పోటీ చేసినా సరే ఓడిపోతానని, అయినా తట్టుకోగలననే భావించి పార్టీని పెట్టానని గుర్తుచేశారు. దెబ్బలు తినటానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకుని నిలబడి మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ, ఈవీఎంల ట్యాంపరింగ్ అలా అనేక రకాల కారణాలను సమీక్షల్లో పాల్గొనే నేతలు చెబుతున్నారు. ఉదాహరణకు గాజువాక, భీమవరంలో తనను ఓడించేందుకు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ అడుగుపెట్టనీయకుండా చేసేందుకు ఏకంగా రూ.150 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు స్థానిక నేతలు చెబుతున్నారన్నారు. అయితే, ఒక్క ఓటమి జనసేనను ఆపలేదన్నారు. 
 
నా శవాన్ని నలుగురు మోసేంతవరకు తాను జనసేనను ముందుకుతీసుకెళ్తానని చెప్పారు. జనసేన శ్రేణులు శక్తిని కూడదీసేందుకు రోడ్లపైకి వెళ్లాలని చెప్పారు. ఎక్కడ సమస్య ఉన్న అక్కడ జనసేన ఉండాలన్నారు. అందరూ గెలిచిన తర్వాత ఏదేదో మాట్లాడుతారు. కానీ, తాను మాత్రం ఓటమి నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పారు. పైగా, తాను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదనీ, ఓటమిని జయించేంత వరకు వదిలిపెట్టే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు.