శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 23 ఆగస్టు 2019 (18:54 IST)

స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఆంధ్రకు పోషణ్ అభియాన్ ప్రోత్సాహక అవార్డులు

విభిన్న విభాగాలలో పోషణ్ అభియాన్ ఆవార్డులు (నేషనల్ న్యూట్రిషన్ మిషన్) దక్కించుకోవటం ఆనందంగా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కృతికా శుక్లా అన్నారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని, ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో మునుపటి కంటే మిన్నగా మహిళా శిశు సంక్షేమం విషయంలో పునరంకితం అవుతామన్నారు. 
 
శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో పోషణ్ అభియాన్ అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్‌కు పలు అవార్డులు వరించగా, ఐసిడిఎస్ సిఎయస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధమ పురస్కారం లభించింది. కార్యకర్తల సామర్ధ్య పెంపుదల(ఐ.ఎల్.ఎ), విభిన్న ప్రభుత్వ కార్యక్రమాలు, పధకాల సమన్వయం, ప్రవర్తనాపరమైన మార్పులు, సామజిక సమీకరణ అంశాలపై ద్వితీయ పురస్కారం దక్కింది.
 
మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి దమయంతి, కమీషనర్ డాక్టర్ కృతిక శుక్లా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పోషణ్ అభియాన్ (నేషనల్ న్యూట్రిషన్ మిషన్) ప్రారంభమైన 2018-19 ఆర్దిక సంవత్సరం నుంచి,  అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ స్థాయిలో అవార్డులు ఇవడం జరుగుతుంది. ప్రధానంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేసిన తీరును పరిశీలించి, అవార్డులు ఇస్తారు. 
 
ఈ అవార్డులు కోసం పోషణ్ అభియాన్ అన్ని జిల్లాలలో కార్యక్రమం అమలవుతున్న తీరును పరిశీలిస్తుంది. క్షేత్ర స్థాయి నాయకత్వ అవార్డులలో జిల్లా స్థాయి నాయకత్వ సమన్వయ అవార్డును కృష్ణా జిల్లా ఎంపికైంది. క్షేత్ర స్థాయి నాయకత్వ అవార్డులలో ప్రాజెక్ట్ స్థాయి నాయకత్వ సమన్వయ అవార్డును అనంతపురం జిల్లా సింగనమల ప్రాజెక్ట్ ఎంపికైంది. ఇక్కడి బాధ్యులు సైతం కేంద్ర మంత్రి నుండి అవార్డులు అందుకున్నారు.