శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (08:54 IST)

మీరిచ్చిన నిధుల కంటే.. 'బాహుబలి' కలెక్షన్లే అధికం : గల్లా జయదేవ్

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కడిగిపారేశారు. అడ్డగోలు విభజన వల్ల తీవ్రంగ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత నాలుగేళ్ళలో బీజేపీ సర్కారు సర్కారు ఇచ్చిన నిధుల కంటే.. తెలు

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ అగ్ర నేతలను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కడిగిపారేశారు. అడ్డగోలు విభజన వల్ల తీవ్రంగ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత నాలుగేళ్ళలో బీజేపీ సర్కారు సర్కారు ఇచ్చిన నిధుల కంటే.. తెలుగు 'బాహుబలి' వసూలు చేసిన కలెక్షన్లే అధికంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు తాను అనడం లేదనీ తమ రాష్ట్ర ప్రజలు జోకులు వేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం వాయిదా పడిన లోక్‌సభ తిరిగి సాయంత్రం ప్రారంభమైంది. ఏపీ డిమాండ్ల కోసం అప్పటి వరకూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్.. ప్రధాని నరేంద్ర మోడి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీను లక్ష్యంగా చేసుకునే మాటలతూటాలు పేల్చారు. 
 
ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చారు. విభజన చట్టంలోని 19 అంశాల్లో ఒక్కటీ అమలు కాలేదు. రెండేళ్ల క్రితం ప్యాకేజీ ప్రకటించినా ఇప్పటి వరకూ ఏమీ చేయలేదు. ఏపీకి కావాల్సింది హామీలు కాదు.. ఆచరణ ముఖ్యం. బెంగళూరు మెట్రోకు, ముంబై మెట్రోకు నిధులు ఇచ్చారు. కానీ విశాఖ, విజయవాడ మెట్రో ఊసే ఎత్తలేదు. విభజన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో కష్టమంటూ హెచ్చరించారు. 
 
కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయనే కారణంగానే బెంగళూరు మెట్రోకు నిధులు కేటాయించిన కేంద్రం పెద్దలు ఏపీకి ఎలా న్యాయం చేస్తారని గల్లా జయదేవ్ నిలదీశారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌లాగే స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే.. ఏపీ ప్రజలేం అమాయకులు కాదని జయదేవ్ హెచ్చరించారు. 'మీరిచ్చిన నిధులకంటే బాహుబలి కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు జోక్‌లు వేసుకుంటున్నారు' అంటూ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.