శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (12:28 IST)

పేకాటలో జోకర్‌కు ఎంత విలువ ఉందో వర్మకేం తెలుసు : టీడీపీ ఎంపీ శివప్రసాద్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను జోకర్లతో పోల్చడంపై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ స్పందించారు. దీనిపై ఆయన సోమవారం మాట్లాడుతూ, తనను జోకర్ అన్నా పెద్దగా బాధపడలేదని, పేకా

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను జోకర్లతో పోల్చడంపై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ స్పందించారు. దీనిపై ఆయన సోమవారం మాట్లాడుతూ, తనను జోకర్ అన్నా పెద్దగా బాధపడలేదని, పేకాటలో జోకర్‌కు ఎంత విలువ ఉందో తెలియదా? అని అడిగారు. పార్లమెంట్‌లో 28 రాష్ట్రాల సమస్యలు వస్తుంటాయని, వాటన్నింటినీ పక్కన బెట్టి, అందరి దృష్టినీ ఏపీ వైపు తిప్పాలంటే, కేవలం ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తే సరిపోదని అన్నారు. 
 
మీడియాను మాత్రమే కాకుండా, అందరి దృష్టినీ ఆకర్షించేందుకు విభిన్నంగా ప్రవర్తించాల్సిందేనన్నారు. సెక్రటరీ జనరల్ దగ్గర ఉన్న రూల్స్ బుక్స్ తీసుకుని తాను పరిగెత్తిన తర్వాతనే సభను వాయిదా వేశారని, తన ఉద్దేశం సభ జరుగనీయకుండా చూడటమేనని, అంతకన్నా తనకు మరో ఉద్దేశం లేదన్నారు. తానేమీ నేరం చేయలేదని అన్నారు. ఏ విధంగా వాయిదా వేయించాలన్నదే తన ఆలోచనని చెప్పుకొచ్చారు. తాము ఇంకా ఏమి చేస్తామోనన్న భయంతోనే కేంద్రం విభజన హామీల అమలుకు కదిలిందని అన్నారు.
 
తాము రాష్ట్రం కోసం ఎంతో చేస్తుంటే, వర్మ కామెంట్లు ఏంటని ప్రశ్నించిన శివప్రసాద్, ఆయనిచ్చిన బిరుదులపై బాధపడటం లేదని, ఎవరు ఏమనుకున్నా తాను ఆగనని చెప్పారు. పనిలేని వర్మలాంటి వాళ్లు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఇకపై మోడీతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.