గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (12:23 IST)

జగన్ సొల్లు కామెంట్స్ ... బీజేపీకి మెజార్టీ ఉందన్న పొగరు : టీజీ ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉందన్న పొగరుతో ఇష్టానుసారంగా నడుచుకుంటోందనీ, దీనికితోడు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమంటూ వైకాపా అధినేత జగన్ మోహ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉందన్న పొగరుతో ఇష్టానుసారంగా నడుచుకుంటోందనీ, దీనికితోడు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసే సొల్లు వ్యాఖ్యల వల్ల ఈ పొగరు మరింత ఎక్కువైందని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆరోపించారు.
 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై టీడీప నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ, కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ ఉందన్న పొగరుతో ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో హోదా అడిగితే ప్రత్యేక ప్యాకేజీ అన్నారు కానీ దానిపై కూడా స్పష్టత లేదన్నారు. మరోసారి తాము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని టీజీ అన్నారు. ఇప్పటికే నాలుగేళ్లు అయింది ఇక సహించేది లేదన్నారు. హామీలు అమలు చేసేది బీజేపీనే అని చెప్పడానికి తాము వెనకాడబోమన్నారు. ఇక పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఆదివారం జరుగనున్న పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం తమ కార్యాచర్యణను చంద్రబాబు ప్రకటిస్తారని టీజీ తెలిపారు. గతంలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారని... మళ్లీ ఆ రోజులు వస్తాయని ఎంపీ టీజీ ధీమా వ్యక్తం చేశారు. హోదా ఇస్తే బీజేపీతో కలుస్తామన్న జగన్ వ్యాఖ్యల వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందడం లేదని ఆరోపించారు.