శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (11:11 IST)

టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్ సాక్షిగా.. భాజపా-వైకాపా బంధాన్ని అంగీకరించిన వైకాపా నేత

సాధారణంగా ఎన్నికల సమయంలో వివిధ పార్టీల పొత్తులు మనం చూస్తూనే ఉంటాం. కానీ లోపాయికారి ఒప్పందాలతో కొనసాగే కొన్ని పొత్తులను ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయో కూటమితో పొత్తులో ఉండిన తెదేపా దాని నుండి బయటకు వచ్చిన వెంటనే... ఎన్డీయే కూటమి... రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న వైకాపాని చేరదీసిందనే పుకార్లు వ్యాపించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ టైమ్స్ నౌ వారి స్టింగ్ ఆపరేషన్ సాక్షిగా వారి పొత్తు తేటతెల్లమైపోయింది.
 
వివరాలలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల నగారా మ్రోగిన తరుణంలో తెదేపా, వైకాపాలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం పర్వం దాకా ప్రతి అంశాన్ని అన్నికోణాలలోనూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నాయి. గత ఏడాది ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చిన తెదేపా ఇప్పుడు ఆ పార్టీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధింస్తున్నారు. ఇందులోభాగంగానే జగన్, మోడీ ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు తెదేపా-భాజపా లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయంటూ వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపా విజయవాడ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి, తమ పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేసారు. 
 
ప్రముఖ ఆంగ్ల ఛానల్ టైమ్స్ నౌ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో.. భాజపా, వైకాపాల ఒప్పందం నిజమేనంటూ చెప్పిన ఆయన పార్టీని ఇరకాటంలో పడేసారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కలకలం రేపుతోంది. భాజపా పోటీ చేసే స్థానాల్లో బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుందని మనోజ్ ఆ వీడియోలో చెప్పడం గమనార్హం. 
 
'రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేం బీజేపీకి మద్దతిచ్చాం. భాజపాతో మా పార్టీకి 100 శాతం అవగాహన ఒప్పందం ఉంది. ఈ విషయంలో మా పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, జగన్‌కు మధ్య బంధం బలపడటానికి ఆయన చాలా చేసారు. రాష్ట్రంలో పోటీ చేయడానికి బీజేపీకి కనీసం అభ్యర్థులు కూడా లేరు. అందుకే ఆ పార్టీ వాళ్లు పోటీచేసే కొన్ని నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులను దించాలని పార్టీ యోచిస్తోంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు.. పార్టీ విధానం కూడా. ఐదేళ్లుగా విజసాయిరెడ్డే జగన్‌కు సలహాలిస్తున్నారు. ఒకవేళ వైకాపా అధికారంలోకి వస్తే ఆయనే ప్రభుత్వాన్ని నడిపిస్తారు' అని మనోజ్ కొఠారి వీడియోలో వెల్లడించారు. 
 
ఎన్నికల హడావుడిలో సదరు వీడియో మరెన్ని దుమారాన్ని లేపనుందో మరి...