శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (16:53 IST)

అభినందన్‌ ఫొటో వాడినందుకు.. ఎమ్ఎల్ఎ గారికి ఈసీ అక్షింతలు...

ఎవరు ఎన్ని చెప్పినా, విమర్శించినా నేను ఇంతేనంటూ పోయే వారు సామాన్యులైనా ఫర్వాలేదేమో కానీ... రాజకీయ నాయకులైతే... అందులోనూ ఎన్నికల సమయంలో అయితే... నోటీసులు అందుకోవలసి ఉంటుంది. తాజాగా ఢిల్లీలో అదే జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పోస్టర్ల మీద వాయుసేన వింగ్ కమాండర్‌ అభినందన్ వర్ధమాన్ ఫోటోను ఉపయోగించినందుకు ఢిల్లీ భాజపా ఎమ్మెల్యే ఓమ్ ప్రకాశ్‌ శర్మకు బుధవారం ఎన్నికల సంఘం(ఈసీ) షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, అభినందన్‌తో పాటు ఎమ్మెల్యే ఫొటోలు ఉన్న రెండు పోస్టర్లను సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్‌లో పెట్టడంపై స్పందించిన ఈసీ వెంటనే వాటిని తొలగించాలనీ, అలాగే గురువారంలోగా వివరణ ఇవ్వాలని ఓం ప్రకాశ్‌ను ఆదేశించింది. 
 
ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళికి విరుద్ధంగా ఉన్నాయని వెల్లడిస్తూ వెంటనే ఆ రెండు పోస్టర్లను తొలగించాలని ఫేస్‌బుక్‌ను కూడా ఆదేశించింది. సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన కమిషన్‌ దాన్ని వెంటనే ఫేస్‌బుక్‌ దక్షిణాసియా డైరెక్టర్‌కు పంపడం జరిగింది. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీసుకువచ్చిన ఈ యాప్‌ ద్వారా కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ప్రజలు చేసే ఫిర్యాదులను స్వీకరిస్తారు.
 
ఇంతకీ శర్మగారు పెట్టిన పోస్టర్లలో ఒకదాని మీద... 'అభినందన్‌ తిరిగి భారత్ రావడం ప్రధాని మోడీ సాధించిన దౌత్య విజయం' అని కూడా రాసి ఉంది. దానిపై సదరు శర్మగారికి జిల్లా మేజిస్ట్రేట్ నోటీసులు కూడా జారీ చేసేసారు. 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన మరుక్షణమే ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చింది.