శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (20:06 IST)

పోలవరం బోట్లో 150 మంది ఎక్కుతారు... కానీ... ఎమ్మెల్సీ సోము వీర్రాజు

అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక శాఖలో బోట్లను తనిఖీ చేసి, వాటి పనితీరుని సమీక్షించే పటిష్టమైన భద్రతా యంత్రాంగం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శాసనసభ ప్రాంగంణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవ

అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక శాఖలో బోట్లను తనిఖీ చేసి, వాటి పనితీరుని సమీక్షించే పటిష్టమైన భద్రతా యంత్రాంగం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శాసనసభ ప్రాంగంణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. భవానీ ఐలాండ్, పవిత్ర సంగమం మధ్య ఆదివారం జరిగిన బోటు ప్రమాదంపై శాసన మండలిలో చర్చ జరిగినట్లు ఆయన చెప్పారు. బోటు ప్రమాద సంఘటనపై సభా సంఘం నియమించాలని కోరినట్లు ఆయన తెలిపారు. 
 
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే రవాణాశాఖలో మాదిరి బస్సులో ఎక్కే ప్రయాణికుల సంఖ్య, తనిఖీ వ్యవవస్థ వంటి భద్రతా ప్రమాణాలు పాటించే యంత్రాంగం లేదన్నారు. బోటులో ఎంతమంది ఎక్కాలి, వాటి సామర్ధ్యం, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని పరిశీలించడానికి తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ఈ శాఖ అంతా అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపైనే నడుస్తుందని చెప్పారు. 
 
పోలవరంలో ఒక్కో బోట్లో 30 మంది నుంచి 150 మంది వరకు ఎక్కుతుంటారని, అయితే నదిలో నీటి ప్రవాహం, ఆటుపోట్లు ఆధారంగా కొన్ని సందర్భాలలో ఎటువంటి ప్రమాదాలు జరుగవని, కొన్ని సందర్భాల్లో అంతే లోడుతో వెళుతున్నా ప్రమాదాలు జరుగుతుంటాయని, అందువల్ల నీటి ప్రవాహం, ఆటుపోట్లు, వాతావరణం, ఇతర అంశాల ఆధారంగా నియమనిబంధనలు రూపొందించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. బోట్లలో ప్రయాణించేవారి ప్రాణాలు కాపాడటానికి ప్రధానమైన చర్యలను ప్రభుత్వం చేపట్టవలసి ఉందన్నారు. బడ్జెట్ సమస్య ఉంటే అదనపు ఛార్జీలు వసూలు చేసి, వాటిని భద్రత కోసం చేపట్టే చర్యలుకు ఖర్చు పెట్టాలని వీర్రాజు  సలహా ఇచ్చారు. 
 
అతిగా ప్రవర్తిస్తున్న వాణిజ్యపన్నుల శాఖ
కొత్తగా జీఎస్టీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖ అతిగా, దూకుడుగా, దురుసుగా ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు. ఏ పన్నులైనా కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు ప్రారంభంలో అవగాహనాలోపం వల్ల  సమస్యలు రావడం సహజమని, దానికి తగ్గట్టుగా అధికారులు వ్యవహరించవలసి అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రంలో 18 శాతం జీఎస్టీ చెల్లించి వచ్చిన లారీలోని సరుకులకు సంబంధించి ఇన్వాయిస్ లేదన్న కారణంగా రూ.8 లక్షల ఫైన్ వేశారని చెప్పారు. వ్యాపారులకు అవగాహన లేనందున కొంత సమయం ఇవ్వాలని అన్నారు. 
 
ఈ విషయమై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావుతో మాట్లాడినట్లు చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల చర్యల వల్ల చిన్న వ్యాపారులు కష్టాలు పడుతున్నట్లు తెలిపారు. రూ.200ల అమ్మకాలకు బిల్లు లేదని రూ.20 వేలు ఫైన్ విధిస్తున్నారని, లారీ రవాణ అయిన సరుకుల్లో ఒక్క సరుకుకు ఇ-వేబిల్లు లేదని మొత్తం సరుకును సీజ్ చేస్తున్నారని, చట్టం అమలులోకి వచ్చిన కొద్ది రోజులకే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. చిన్న వ్యాపారులపై డాడులు చేయడం భావ్యం కాదన్నారు.
 
రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఒక లేఖ ఇచ్చారని, అందులో తమ బాధలు తెలిపారని చెప్పారు. వర్తకుల సమస్యలు శాసనసభలో, మండలిలో చర్చిస్తామన్నారు. ఆ లేఖను తమ ఫ్లోర్ లీడర్‌కు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతామని చెప్పారు. వ్యాపారులపై దాడులు, ఫైన్లు వేయడాలు ఆపాలని వీర్రాజు కోరారు.