శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 మే 2018 (08:17 IST)

తాగొచ్చి నానా యాగీ చేస్తున్నాడనీ.... పచ్చడిబండతో దాడి

తెలుగు రాష్ట్రాల్లో భర్తలకు రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రాల్లో భర్తలపై భార్యామణులు దాడులు చేస్తున్నారు. పెక్కు సంఘటనల్లో ఏకంగా భర్తలనే కడతేర్చుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భర్తలకు రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రాల్లో భర్తలపై భార్యామణులు దాడులు చేస్తున్నారు. పెక్కు సంఘటనల్లో ఏకంగా భర్తలనే కడతేర్చుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా కంతేరు గ్రామంలో తాగొచ్చిన భర్త రాత్రిపూట నానా యాగీ చేస్తున్నాడనీ ఆగ్రహించిన భార్య... గాఢ నిద్రలో ఉన్న భర్తపై పచ్చడిబండతో దాడి చేసింది. దీంతో అతను తలపగిలి అక్కడే చనిపోయాడు. దీంతో భార్య పారిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కంతేరు గ్రామానికి చెందిన వాకా వెంకటేశ్వర్లు(45), లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వెంకటేశ్వర్లు ఆ గ్రామంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. పచ్చి తాగుబోతు. రాత్రుళ్లు బాగా తాగివచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. మంగళవారం రాత్రి కూడా ఎప్పటిలాగే పీకల వరకు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. 
 
ఆ తర్వాత భార్యతో గొడవకు దిగాడు. దీంతో వెంకటేశ్వర్లు తండ్రి, సోదరుడు జోక్యం చేసుకొని, గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఇంటి బయట పడుకొన్నాడు. అతడు మంచి నిద్రలో ఉండగా, వంటగదిలో ఉన్న పచ్చడిబండతో భర్త తలపై బలంగాకొట్టింది. వెంకటేశ్వర్లు పెద్దగా కేకలుపెట్టడంతో చుట్టుపక్కలవారు పరిగెత్తుకొనివచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో కొద్దిసేపు తన్నుకొని వెంకటేశ్వర్లు చనిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న లక్ష్మి కోసం గాలిస్తున్నారు.